బాలినేని వర్సెస్ చెవిరెడ్డి: వైసీపీలో ర‌గ‌డ ..!

బాలినేని వర్సెస్ చెవిరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఇద్దరు మధ్య ఆధిపత్యం పోరు తారా స్థాయికి చేరుకుందా? అంటే అవుననే అంటున్నారు వైసిపి నాయకులు. గత ఎన్నికలకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకువచ్చి ఒంగోలు పార్లమెంటు స్థానంలో నిలబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా ఎన్నికల తర్వాత చెవిరెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన తిరిగి తన స్థానానికి వెళ్లిపోతారని ప్రకాశం జిల్లా నాయకులు భావించారు.

ముఖ్యంగా మాజీ మంత్రి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అనుకున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు బాలినేని పెత్తనం పోయి చెవిరెడ్డి పెత్తనం తెరమీద‌కు వచ్చింది. అప్పట్లోనే బాలినేని ఈ విధానాన్ని తప్పుపట్టారు. చెవిరెడ్డికి టికెట్ ఇవ్వద్దని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా బాలినేని ని ప‌క్క‌న పెట్టి, చెవిరెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఎన్నికల్లో చెవిరెడ్డి ఓడిపోయారు. దీంతో ఇక చెవిరెడ్డి వెళ్లిపోతారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు.

కానీ ఎన్నికల ముగిసి నెలరోజులు దాటి పోయినా చెవిరెడ్డి పెత్తనం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చెవిరెడ్డి చక్రం తిప్పటం, బాలినేని వర్గానికి ఇబ్బందిగా మారింది. ఇదే తాజాగా బాలినేని ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమ‌ని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పట్టు కోసం ఒకవైపు మాజీ మంత్రి సురేష్ మరోవైపు బాల్నని శ్రీనివాసరెడ్డి మధ్య అంతర్గత కొమ్ములాట న‌డుస్తోంది. ఈ మధ్యలో చెవిరెడ్డి జోక్యం చేసుకోవడం.. ఇప్పుడు పూర్తిగా చెవిరెడ్డి ఆదిపత్యం లోనే ప్రకాశం జిల్లా ఉండడంతో బాలినేనికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

అందుకే తాజాగా ఆయన వైసీపీలో అనేక అవమానాలు జరిగాయని, అనేక అవమానాలను నేను తట్టుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ అవమానాలు చెవిరెడ్డి రూపంలోనే వచ్చాయి అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మరో కాణం కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి నేరుగా బాలినేనిని ఎదుర్కొనలేక చెవిరెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారని ఒక చర్చ ఉంది, పైగా ఎన్నికల ముగిసిన తర్వాత చెవిరెడ్డి వెళ్ళిపోతాను అన్న వైవి సుబ్బారెడ్డి బలవంతంగా ఇక్కడ ఉంచారని కూడా వైసిపి నాయకుల్లో చర్చి నడుస్తుంది.

ఎట్లా చూసుకున్న ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరి స్థానానికి వాళ్లు వెళ్లిపోయి ఉంటే బాగుండేది అనేది బాలినేని వర్గం చెబుతున్న మాట. అలా కాదని నియోజకవర్గంలోనే ఉండి రాజకీయాలను శాసిస్తూ వైసిపి నాయకులను కట్టడం చేస్తూ బాలినేని వర్గంలో చిచ్చుపెట్టేలాగా చెవిరెడ్డి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే జరిగితే మునుముందు బాలినేని వర్గం తిరగబడే అవకాశం ఉంటుందని ఒక సమాచారం. మరి ఇప్పటికైనా జగన్ జోక్యం చేసుకుని ఈ ఆదిపత్య రాజకీయాలకు తెర‌దించుతారో లేదో చూడాలి.