వైఎస్ పై ఉన్న అభిమానంతో ఓర్చుకున్నా

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న మీడియా ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం కూడా.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీలో తాను అనేక ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు. సొంత పార్టీ నాయ‌కులే.. త‌న‌ను, త‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా త‌న కుటుంబంపై సోష‌ల్ మీడియాలో జ‌రిగిన దాడి అంతా ఇంతా కాద‌ని బాలినేని చెప్పారు. దివంగ‌త వైఎస్ పై ఉన్న అభిమానం.. ఆయ‌న ప‌ట్ల ఉన్న గౌర‌వంతోనే తాను అన్ని దాడుల‌ను ఓర్చుకు న్న‌ట్టు బాలినేని తెలిపారు. “నేను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కోరుతున్నా” అని బాలినేని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ స‌రిగా పాల‌న చేయ‌న‌ప్పుడు కూడా తాను ప్ర‌శ్నించాన‌ని, అందుకే సొంత పార్టీలోనూ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ‌చ్చింద‌న్నారు. తాను ఎవ‌రికీ లొంగి ఉండే ప్ర‌శ్నే లేద‌న్నారు. త‌న ఆస్తుల గురించి ప‌లు రూపాల్లో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ, త‌మ‌కు 1973లోనే ఆస్తులు ఉన్నాయ‌ని చెప్పారు. త‌న‌కు ప్ర‌త్యేకంగా అప్ప‌ట్లోనే కారు ఉంద‌న్నారు. త‌మ కుటుంబం వివాదాల‌కు దూరంగా ఉంటుంద‌న్న బాలినేని.. అలాంటి త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని చెప్పారు.

పార్టీ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఒక సైలెంట్ పిరియ‌డ్‌లో ఉన్నామ‌న్నారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తామ‌ని.. అయితే.. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని.. అప్పుడు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తామ‌ని బాలినేని చెప్పారు. ఈ నెల రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన అభివృద్ది ఏమీలేద‌ని విమ‌ర్శించారు. కేవ‌లం పింఛ‌న్లు ఇచ్చార‌ని.. అంత‌కు మించి ఏం చేశారో చెప్పాల‌ని టీడీపీని ప్ర‌శ్నించారు. దేశంలో అప్పులు చేయ‌కుండా ఏ ప్ర‌భుత్వ‌మూ న‌డిచే ప‌రిస్తితి లేకుండా పోయింద‌న్నారు.