ఫైనాన్షియ‌ల్ వైట్ పేప‌ర్‌.. చంద్ర‌బాబు మంచి నిర్ణ‌యం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… గత వైసీపీ ప్రభుత్వంపై శ్వేత పత్రాల రూపంలో ప్రత్యేక వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం విషయాల్లో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లను అక్రమాలను వశదీకరిస్తూ ఆయన శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో ముందుగానే ప్రకటించిన ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రాన్ని పక్కనపెట్టిన చంద్రబాబు అనూహ్యంగా సహజవ‌న‌రుల‌ దోపిడీ, గ‌నులు, ఇసుక తదితర అక్రమాలను వివరిస్తూ సహజ వనరులపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

ఇది ముందుగా ఎక్కడా ప్రకటించకపోవడం గమనార్హం. అనూహ్యంగా దీన్ని విడుదల చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయంలో సహజ వనరులను దోచుకున్నారని, ఇసుక, గనుల కుంభకోణాలు జరిగాయని వివరించారు. అయితే కీలకమైన ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే ఈ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన తర్వాత అనేక మంది ఆర్థిక నిపుణులు అలా చేయొద్దని ప్రభుత్వానికి సూచనలు సలహాలు కూడా ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం రూపంలో ప్రభుత్వం విషయాలు గనక వివరిస్తే అందులోని లోటుపాట్లు బయటకు చెబితే అది పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులు కడుతున్న వడ్డీలు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు వంటి వాటిని
వివరిస్తే వచ్చే పెట్టుబడిదారులు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని అనేకమంది ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయాలను సీరియస్‌గా తీసుకొని చంద్రబాబు ఆర్థిక శ్వేత పత్రంపై అనేక చర్చలు జరిపారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆర్థిక శ్వేత పత్రాన్ని విడుదల చేసే విషయంలో వెన‌క్కి తగ్గారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది మంచి నిర్ణయం. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖ పత్రాన్ని విడుదల చేసి చేతులు కాల్చుకుంది. అప్పటి వరకు వస్తాయ‌న్న ప్రధానమైన మూడు కంపెనీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత సంక్షేమ పథకాలు రూపంలో వస్తున్న నిధులకు సంబంధించిన వివరాలు తెలిసిన తర్వాత ఆ కంపెనీలు వెనక్కి తగ్గాయి.

ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు చెప్పడంతో చంద్రబాబు ఫైనాన్షియల్ వైట్ పేపర్ విషయంలో వెన‌క్కి త‌గ్గారు. ఈ నిర్ణయం మంచిదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం ఇది ఆగినా మున్ముందు ఆయన వైట్ పేపర్ను ప్రవేశపడతారా లేకపోతే వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ కి సంబంధించి కార్య‌కలాపాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మీదట శ్వేత‌ పత్రం ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తోంది.

ఆర్థిక శ్వేత పత్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను, ప్రస్తుతం కడుతున్న వడ్డీలను చెప్పాల్సి ఉంటుంది. ఇదే తెలిస్తే రాష్ట్రానికి ఉన్న ఆదాయం కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని వడ్డీలు ఎక్కువగా భరించాల్సి వస్తుందని స్ప‌ష్ట‌మవుతుంది. తద్వారా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన‌ట్టు అవుతుంది. అది పెట్టుబడుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆర్థిక నిపుణులు చెప్పిన సలహాలను పాటించడం వంటివి మంచిద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.