మోడీ దగ్గర జగన్ అప్పుల చిట్టా పెట్టా: చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అప్పుల అప్పారావుగా మారిన జగన్ అందిన కాడికి ఇటు బ్యాంకు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్న వ్యవహారంపై కాగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు…జగన్ చేసిన అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ దివాలా తీసిందని, ఖజానాలో డబ్బులు లేవని చంద్రబాబు అన్నారు. అంతేకాదు, ఇదే విషయాన్ని ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీకి కూడా వివరించానని చంద్రబాబు తాజాగా చెప్పారు.

అనకాల్లిలో పర్యటిస్తున్న చంద్రబాబు..ఏపీలో జగన్ చేసిన అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామని, ఎన్నికల్లో చెప్పిన విధంగా హామీలను నెరవేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశామని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని, కానీ ఆ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం గోదాట్లో కలిపేసిందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఆ ప్రాజెక్టుకు 800 కోట్ల రూపాయల ఖర్చవుతుందని వెల్లడించారు. వీలైనంత త్వరగా దానిని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని తీసుకురావచ్చని చంద్రబాబు వెల్లడించారు.

గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేయడం ద్వారా ఏపీలో కరువు అనే మాట వినిపించకుండా చేస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత అని, అబద్ధాలు చెప్పే నాయకుల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే మూడు శ్వేత పత్రాలు విడుదల చేశామని, ప్రజలు తమకు కళ్ళు తిరిగే మెజార్టీని అందించారని, అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

అనకాపల్లిలో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై ఎంపీ సీఎం రమేష్, మంత్రి అనితలు దృష్టి పెట్టాలని ఆదేశించానని చంద్రబాబు చెప్పారు. శాశ్వతంగా ఆ సమస్య పరిష్కరించాలని భావిస్తున్నామన్నారు. ముందు పోలవరం తర్వాత అమరావతి వెళ్తానని అన్నారు.