ష‌ర్మిల‌కు రేవంత్ బిగ్ టాస్క్.. స‌క్సెస్ అవుతారా..?

ఏపీ పీసీసీచీఫ్ షర్మిలే సీఎం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం 2.86 శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కనీసం 50 శాతానికి పుంజుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందా నాయకులు కలివిడిగా ముందుకు సాగుతున్నారా? అంటే అది కూడా కనిపించడం లేదు. సహజంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో బలం, ప్రజల్లో అభిమానం ఇవి రెండు మెండుగా ఉండాలి.

కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఒక శాతం ఓటు బ్యాంకు మాత్రమే షర్మిల వల్ల దక్కిందని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలి? ఏ విధంగా ముందుకు సాగాలి? ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అనేవి ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి తాజాగా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న ఏకైక ల‌క్ష్యంతోనే షర్మిల ముందుకు సాగారు. వాస్తవానికి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో ఇటువంటి విధానం ఎక్కడా లేదు.

ముందు తాను పుంజుకోవడం ద్వారా ప్రత్యర్థులను మట్టి క‌రిపించాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంభించింది. జాతీయ స్థాయి రాజకీయాలను చూసుకుంటే మోడీని ఓడించాల‌న్న కసితో కాంగ్రెస్ పని చేసింది. కానీ, ఎక్కడా అదే పాయింటును ప్రాజెక్టు చేస్తూ నాయకులు మాట్లాడింది లేదు . దేశ సమస్యలు, రాష్ట్రాల సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, రాజ్యాంగం ఇట్లా అనేక కోణాలను ఆవిష్కరించారు. వీటిలో మోడీని తీసుకువచ్చి ప్రచారం చేశారు.

కానీ ఏపీలో అలా జరగలేదు. కనీసం అప్పటి ప్రతిపక్షాలను ఒక్క మాట కూడా, ఒక విమర్శ కూడా చేయకుండానే షర్మిల కేవలం జగన్ను టార్గెట్ చేసుకొని వైయస్ వివేకానంద రెడ్డి హత్యను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేశారు. ఫలితంగా షర్మిల ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మాత్రమే వచ్చారు అనే చర్చ రాజకీయ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ఎక్కువగా జరిగింది. ఇది ఆమెను వ్యక్తిగతంగా మైనస్ చేసింది. నిజానికి షర్మిల చేసిన ప్రచారం స్థాయిలో విపక్షాలు కూడా చేయలేదనేది వాస్తవం.

చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాల పాటు జగన్ పై పోరాడినా.. షర్మిల చివరి మూడు నెలల్లో చేసినంత ప్రచారం మాత్రం చేయలేకపోయారు. దీనిని షర్మిల వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల సమస్యలకు అన్వయించి ప్రచారం చేసుకుని ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేది. కానీ వ్యక్తిగత విమర్శలు కుటుంబ నేపథ్యం, హత్యలు, ఆస్తులు వంటి వాటిని తీసుకువచ్చి జగన్ మైనస్ చేయగలిగారు. జగన్ను అధికారం కోల్పోయేలా చేసారే కానీ కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా మాత్రం చేయలేకపోయారు. ఇది నిర్వివాదాంశం.

దీనిని దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు షర్మిల ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే ఈ పంథాల‌ను కచ్చితంగా వదిలిపెట్టాలి. వ్యక్తిగత విమర్శలకు రాజకీయాల్లో తక్కువ స్థానం ఉంటుంది. రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రస్తావించినప్పుడు వారి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించినప్పుడు మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారు. ఈ విషయం తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించంది. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక దశలో వ్యక్తిగతంగా విమర్శలు చేసినా తర్వాత తనను తాను మార్చుకున్నారు.

రాష్ట్రం కోసం ప్రజల కోసం అన్న భావనను కల్పించారు. తద్వారా 100% స్ట్రైక్ రేట్ తో పవన్ విజయం సాధించగలిగారు. షర్మిల కూడా ఇదే పంథా అనుసరించాల్సిన అవసరం అయితే కచ్చితంగా కనిపిస్తోంది. మరి ఆమె తనను తాను మార్చుకుంటారా ? ఆ దిశగా తన రాజకీయాలను మలుచుకుంటారా? అనేది ప్రధానంగా చూడాల్సిన విషయం. ఇలా కాకుండా ఇంకా వ్యక్తిగతంగానే జగన్ను టార్గెట్ చేసినా, ఇంకా వ్యక్తిగతంగానే రాజకీయాలు చేస్తానని ముందుకు సాగినా రేవంత్ రెడ్డి చెప్పిన ముఖ్యమంత్రి పదవి అయితే ఆమెకి దక్కడం అంతా సులువేమీ కాదు.