అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు ఇటీవల చేశారు. ఆయన టీడీపీలో కీలక నాయకుడు. మాజీ ఎమ్మెల్యే కూడా. కానీ ఆయన పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు పార్టీకి దూరంగా ఉన్న కొందరి పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటన్నది చర్చనీయాంశమైంది.

క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి దూరంగా ఉన్నా నాయకులను ప్రసన్నం చేసుకుంటున్న వారు ఉన్నారు. మరోవైపు పార్టీలో ఉండి కార్యక్రమాలు చేస్తున్న వారైతే పనులు జరగడం లేదని అంటున్నారు. దీనిపై పార్టీ స్థాయిలో విశ్లేషణ కూడా జరుగుతున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారి పనులు సులభంగా జరుగుతున్నాయి. కానీ ఎమ్మెల్యేలను నమ్మకుండా పార్టీ బలంగా నిలపాలనే వారిని పక్కన పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలా జరుగడానికి ఉన్న కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని సీనియర్లు కూడా సూచిస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో కొందరికే నామినేటెడ్ పదవులు దక్కాయి. మిగిలిన వారు మౌనంగా పార్టీకి సేవ చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిని పెద్దగా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోటీ భయం కావచ్చు లేదా అధిపత్య రాజకీయాల అనుమానం కావచ్చు.

ఈ పరిస్థితి చివరికి పార్టీకే నష్టం చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు చిన్న చిన్న పనులు అయినా చేయించుకోవాలని ఆసక్తిగా ఉంటారు. ఇవి కూడా జరగకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారన్న మాట చంద్రబాబు వరకు వెళ్లింది. దీనిపై చంద్రబాబు స్పందించి అందరినీ సమానంగా చూడాలని చెప్పినా మార్పు స్పష్టంగా కనిపించడం లేదని నాయకులు అంటున్నారు.

దీంతో సంతృప్తి అసంతృప్తి మధ్య నాయకులు తేలియాడుతున్న పరిస్థితి నెలకొంది.