ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ విషయంలో మహిళలు బాగా ఓపెన్ అవుతున్నారు. సోషల్ మీడియా ఊపందుకోవడం.. ‘మీ టూ’ ఉద్యమం ధైర్యాన్నివ్వడంతో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ఐతే పేరున్న హీరోయిన్లు ఇలాంటి వాటి గురించి చెబితే.. మీడియాలో హెడ్ లైన్స్‌గా మారిపోతాయి. కానీ అంతగా ఫేమస్ కాని మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే వేధింపుల గురించి పెద్దగా చర్చ జరగదు.

తెలుగులో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన మిర్చి మాధవి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవం గురించి వెల్లడించింది. ఒక సినిమా టీం తనను సంప్రదించి.. ఐదుగురికి ఒకేసారి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగినట్లు ఆమె చెప్పింది.

‘100 పర్సంట్ లవ్’ సహా పలు చిత్రాల్లో నటించిన మిర్చి మాధవికి చాలా ఏళ్ల ముందు ఒక సినిమాలో అవకాశం వచ్చిందట. ఆ సినిమా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి.. ‘100 పర్సంట్ లవ్‌’లో తన నటన చూసి సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పారట. ఐతే ఈ ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని.. తాము ఐదుగురు ఉంటామని ఓపెన్‌గా చెప్పాడట ఆ వ్యక్తి.

ఐతే ఇలాంటి వ్యక్తులతో గొడవ పడి లాభం లేదని.. తాను వాళ్లకు సింపుల్‌గా నో చెప్పి ఊరుకున్నట్లు మిర్చి మాధవి వెల్లడించింది. ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే.. సినిమాలు వదిలేసి అదే పని చేసుకుంటూ ఉండేదాన్నని.. నటన మీద ఇష్టంతో సినిమాల్లో కొనసాగుతున్నానని ఆ వ్యక్తికి చెప్పి తన పని తాను చేసుకున్నట్లు మిర్చి మాధవి వెల్లడించింది. తర్వాత ఎప్పుడూ తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఆమె తెలిపింది