ఏపీలో డొక్కా సీత‌మ్మ క్యాంటీన్లు కూడా..

2014-19 మ‌ధ్య అధికారంలో ఉండ‌గా తెలుగుదేశం ప్ర‌భుత్వం చేసిన మంచి కార్య‌క్ర‌మాల్లో పేద‌ల‌కు చౌక‌గా భోజ‌నం పెట్టే అన్నా క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ ఒక‌టి. దేశంలో ఎక్క‌డా లేని స్థాయిలో రూ.5కే ఎంతో నాణ్య‌మైన భోజ‌నం పెట్టి పేద‌ల క‌డుపు నింపింది అప్ప‌టి ప్ర‌భుత్వం.

తెలంగాణ‌లో కూడా రూ.5కే భోజ‌నం పెట్టే క్యాంటీన్లు ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో మెయింటైన్ చేసిన క్వాలిటీ వేరు అని అక్క‌డ భోజ‌నం చేస్తే తెలంగాణ వాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది క‌డుపు నింపే ఆ క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ స‌ర్కారు అధికారంలోకి రాగానే మూసేసింది.

క‌నీసం పేరు మార్చి కూడా వాటిని నిర్వ‌హించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కాగా ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం తిరిగి అన్న క్యాంటీన్ల‌ను మొద‌లుపెడుతోంది. కొన్ని చోట్ల ఇప్ప‌టికే క్యాంటీన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.

ఐతే రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం అన్న క్యాంటీన్లే కాక డొక్కా సీత‌మ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి. ఈమేర‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పిఠాపురంలో జ‌న‌సైనికుల స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యం ప్ర‌స్తావించారు.

ఒకప్పుడు డొక్కా సీత‌మ్మ చేసిన మంచి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌స్తావిస్తూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల‌తో పాటు డొక్కా సీత‌మ్మ క్యాంటీన్ల‌ను కూడా పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఈ మేర‌కు తాను విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు ప‌వ‌న్ తెలిపాడు. ప‌వ‌న్ మంచి ఉద్దేశంతోనే ఈ మాట చెప్పాడు కాబ‌ట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైతం దీనికి ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశ‌ముంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధి చెందారు డొక్కా సీతమ్మ. గోదావరి ప్రాంతాల్లో తరచుగా వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆకలి ఆపద నుంచి ఆదుకున్నారు.

వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం చేసి గొప్ప పేరు సంపాదించారు. ఆమె గురించి ప‌వ‌న్ గ‌తంలోనూ ప‌లుమార్లు ప్ర‌స్తావించారు. ఇప్పుడు ఉప‌ముఖ్య‌మంత్రిగా ఆయ‌న డొక్కా సీత‌మ్మ క్యాంటీన్లు రావాల‌ని అభిల‌షిస్తున్నారంటే అది జ‌ర‌గ‌బోతున్న‌ట్లే. గోదావ‌రి ప్రాంతంలో కొన్ని క్యాంటీన్ల‌కు ఈ పేరు పెట్టే అవ‌కాశ‌ముంది.