నన్ను ఓడించింది మీరేనా.. అభినందనలు !

నవీన్ పట్నాయక్. సమకాలీన రాజకీయాల్లో ఆయనదో కొత్త వరవడి. ఒడిశా 14వ ముఖ్యమంత్రిగా 5 మార్చి 2000 నుండి 12 జూన్ 2024 వరకు సుధీర్ఘంగా దేశంలో 24 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి.

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ కుమారుడు అయిన నవీన్ రాజీవ్ గాంధీకన్నా మూడేళ్లు చిన్న, ఆయన సోదరుడు సంజీవ్ గాంధీకి క్లాస్ మేట్. రాజకీయాలకు దూరంగా పెరిగిన నవీన్ తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం 1997లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు మరియు అదే సంవత్సరం బిజూ పట్నాయక్ పేరుతో బిజు జనతా దళ్‌ని స్థాపించి సుధీర్ఘ పాలన అందించాడు.

ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్ జిల్లాలోని కంటాబంజి నుంచి పోటీ చేసిన ఆయన కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో 16344 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

హింజలి నుంచి గెలవడంతో నిన్న ప్రమాణస్వీకారం కోసం ఒడిషా అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అందరినీ పలకరించి వెళ్తుండగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌బాగ్ లేచి ఆయనకు నమస్కరించారు. అనంతరం తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ వెంటనే నవీన్ స్పందిస్తూ.. ‘‘ఓహో.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’’ అని చెప్పారు. మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం మోహన్ మాఝీ, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. తనను ఓడించిన అభ్యర్థిని పట్నాయక్ అభినందించడాన్ని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ప్రత్యర్థిని అభినందించిన సుధీర్ఘకాల ముఖ్యమంత్రి గొప్పతనంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.