టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు.. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వాస్త‌వానికి ఈ నెల 16న ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. పోటీలో ఎవ‌రూ లేక‌పోవ‌డం.. ఉన్న రెండు సీట్ల‌కు ఇద్ద‌రే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో రిట‌ర్నింగ్ అధికారి తాజాగా.. వారిని ఎన్నుకున్న‌ట్టు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందుకున్నారు. దీంతో వారు లాంఛ‌నంగా ఎన్నికైన‌ట్టు అయింది.

అయితే..ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యంచోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత‌.. అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ నుంచి రెండో సారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే.. ఆయ‌న రిట‌ర్నింగ్ అధికారి నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న త‌ర్వాత‌.. వెనువెంట‌నే ఆయ‌న విమానం ఎక్కేశారు. ఈ చ‌ర్చ కాంగ్రెస్ నాయ‌కుల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో క‌లిసి వేం న‌రేందర్‌రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీలు.. రిట‌ర్నింగ్ అధికారిని క‌లుసుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం తీసుకున్న అభిషేక్‌.. త‌న‌కు ప‌ని ఉందంటూ… శంషాబాద్‌కు వెళ్లిపోయి.. విమానం ఎక్కేశారు.

వాస్త‌వానికి ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబు అభిషేక్‌కు సూచించారు. కానీ, ఆయ‌న ప‌ట్టించుకోలే దు. ఇక‌, వేం న‌రేందర్ రెడ్డి మాత్ర‌మే మీడియాతో సంభాషించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఢిల్లీ వేదిక‌గా ప్ర‌య‌త్నాలు చేస్తా న‌న్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా ప‌థ‌కాల విష‌యాన్ని రాజ్య‌స‌భ వేదికగా ప్ర‌స్తావించ‌నున్న ట్టు చెప్పారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా.. అభిషేక్ మ‌ను సింఘ్వి వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.