చంద్ర‌బాబు చాణ‌క్యం.. అందుకే అయ్య‌న్న‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడును టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు నియ‌మించారు. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడైన అయ్య‌న్న‌కు బాబు త‌గిన ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఏపీలో బాబు సార‌థ్యంలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఈ నెల 24న అసెంబ్లీ స‌మావేశాలు ఆరంభ‌మ‌వుతాయి. ఎమ్మెల్యేలు అంద‌రూ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో పాటు స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవ‌డానికి ఈ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్‌గా అయ్య‌న్న‌పాత్రుడును బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే స్పీక‌ర్ ప‌ద‌విని అయ్య‌న్న‌కు అప్ప‌గించ‌డం వెనుక చంద్ర‌బాబు చాణ‌క్యం దాగిఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

స్పీక‌ర్ స్థానం ఎంతో ఉన్న‌త‌మైంది. రాజ్యాంగ‌బ‌ద్ధంగా గౌర‌వ‌ప్ర‌ద‌మైంది. అంతే కాకుండా స‌భను స‌జావుగా సాగించేలా స్పీక‌ర్ కీల‌క పాత్ర పోషిస్తారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్య‌న్న‌కు బాబు జై కొట్టారు. సీనియారిటీ ప‌రంగానే కాకుండా వైసీపీకి ధీటుగా స‌మాధానం చెప్పే నాయ‌కుడిగా అయ్య‌న్న‌కు పేరుంది. ఈ ఎన్నిక‌ల్లో దారుణంగా ప‌రాజ‌యం పాలైన వైసీపీ స‌భ‌లో ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో చెప్ప‌లేం. స‌భ‌లో గంద‌ర‌గోళానికి, అల్ల‌ర్ల‌కు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నించే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం.

శాస‌నస‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేందుకు, ఆరోప‌ణ‌లు చేసేందుకు వైసీపీ నాయ‌కులు సిద్ధంగానే ఉంటారు. గెలిచింది 11 మంది స‌భ్యులే అయినా స‌భ‌లో ఉద్రిక్త‌క‌ర ప‌రిస్థితులు రేకెత్తించేందుకు వైసీపీ వాళ్లు ప్రయ‌త్నించే ఆస్కారం ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎంతో అనుభ‌వ‌మున్న అయ్య‌న్న వైసీపీకి కౌంట‌ర్ ఇస్తార‌నే చెప్పాలి. స‌భ‌లో వైసీపీ నాయ‌కులు ఏ మాత్రం గంద‌ర‌గోళం సృష్టించినా అయ్య‌న్న క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. అందుకే స‌భ‌లో వైసీపీని క‌ట్ట‌డి చేయ‌డం కోసం అయ్య‌న్న‌కు చంద్ర‌బాబు స్పీక‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.