ఏపీ ప్ర‌భుత్వానికి ష‌ర్మిల లేఖ‌.. ఏమ‌న్నారంటే!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన చంద్ర‌బాబు స‌ర్కారుకు కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాశారు. తొలుత ఆమె మంత్రివ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు అని తెలిపారు. అనంత‌రం జ‌న‌సేన అధినేత‌, మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌కు కూడా ఆమె శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌, మంత్రుల‌ను కూడా అభినందిం చారు.

అయితే.. ఇదే లేఖ‌లో రెండు కీల‌క విష‌యాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. కేంద్రంలోని ఎన్డీయే తో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని ఆమె విన్నివించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను సాధించాల‌ని ఆమె సూచించారు. ఇదేస‌మ‌యంలో పోల‌వ‌రం  నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని, నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నార‌ని.. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌ట్టించుకోవాల‌ని ష‌ర్మిల కోరారు.

రైతులకు సాగునీరు స‌మ‌స్య‌గా మారింద‌ని.. రైతుల ఆవేద‌న ను కూడా ప‌ట్టించుకోవాల‌ని సూచించారు. మ‌రికొద్ది రోజుల్లోనే సాగు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని కోరారు.

ఇక‌, రెండో కీల‌క అంశంగా రాష్ట్రంలో కొంద‌రు దుండ‌గులు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను ఎక్క‌డికక్క‌డ ధ్వంసం చేస్తున్నార‌ని.. రాజ‌కీయ ప్రతీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్నార‌ని ఈ విధ్వంసాల‌ను ఆపాల‌ని ష‌ర్మిల కోరారు. “త‌క్ష‌ణ‌మే ఈ దాడుల‌ను నిలువ‌రిం చండి“ అని ష‌ర్మిల సూచించారు.

రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని తెలిపారు. ఇది స‌రికాద‌ని అన్నారు. ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశార‌ని చెప్పిన ఆమె.. ఇప్ప‌టికైనా రాష్ట్రంలో ఇలాంటి ప‌రిస్థితిని నిలువ‌రించాల‌ని సూచించారు. రాజ‌కీయ దాడుల‌కు ఇది స‌మ‌యం కాద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను కూడా ప‌రిర‌క్షించాల‌ని సూచించారు.