మోడీ ఫ‌స్ట్ సంత‌కం.. 9 కోట్ల మందికి డ‌బ్బే డ‌బ్బు!!

మూడో సారి ముచ్చ‌ట‌గా భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసింది. ఇది స‌రికొత్త రికార్డుగా బీజేపీ భావిస్తోంది. బీజేపీ చ‌రిత్ర‌లో ఇన్ని సార్లు అధికారంలోకి రావ‌డం.. ఒకే నేత ప్ర‌ధాని కావ‌డం.. ఇదే తొలిసారి. ఇక‌, ఆదివారం రాత్రి ప్ర‌ధానిగా మోడీ ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌.. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌ధాని ఆఫీస్‌కు చేరుకున్నారు. గ‌తంలో కూర్చున్న కుర్చీలను మార్చేశారు. అదేవిధంగా ప్రాంగ‌ణంలో మార్పులు కూడా చేశారు.

ఉన్న‌తాధికారులు, కేబినెట్ సెక్ర‌ట‌రీలతోనూ.. ప్ర‌ధాని సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భేటీ అయ్యారు. వ‌చ్చే 100 రోజుల భవిష్య‌త్తు, కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు. అనంత‌రం.. ప్ర‌ధానిగా ఆయ‌న తొలి సంతకం చేశారు. గ‌తానికి భిన్నంగా ఈ సారి మాత్రం ప్ర‌ధాని మోడీపై ఉత్త‌రాది రాష్ట్రాల ప్ర‌భావం క‌నిపించింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఉత్త‌రాదిన సీట్లు త‌గ్గాయి. పైగా.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు యూపీ, బిహార్‌, స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో తొలి సంత‌కానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ప్ర‌ధాని మోడీ త‌న తొలి సంత‌కాన్ని ‘పీఎం కిసాన్’ ఫైలుపై చేశారు. పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదలకు మార్గం సుగ‌మ‌మైంది. దీనికింద దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుత సీజ‌న్‌లోనే 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. ఒక్కొక్క రైతుకు రూ.2000 చొప్పున పెట్టుబ‌డి సాయం అంద నుంది. ఇది ఉత్త‌రాది రాష్ట్రాల రైతుల‌ను దృష్టిలో పెట్టుకునే ప్ర‌ధాని చేసిన ప్ర‌యోగంగా చెబుతున్నారు. 2019లో ర‌క్ష‌ణ ప‌రిక‌రాల కొనుగోలుపై సంత‌కం చేశారు. త‌ద్వారా దేశాన్ని ర‌క్షిస్తున్నామ‌న్న‌.. సంకేతాలు ఇచ్చారు.

ఇప్పుడు మాత్రం రైతుల‌కు మేలు చేసేందుకు తాము క‌ట్ట‌బడి ఉన్నామ‌న్న సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అంతో ఇంతో త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు మోడీ. త‌ద్వారా త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌భావం క‌నిపించేలా వ్య‌వ‌హ‌రించారు. కిసాన్ కళ్యాణ్‌‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితమ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.