శ్రీకాకుళం ఎంపీకి కేంద్రంలో కీల‌క ప‌ద‌వి.. శాఖ ఇదే!

కేంద్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి కొలువు దీరిన మోడీ స‌ర్కారు.. తాజాగా త‌న కూట‌మి పార్టీల నుంచి ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించింది. వీరిలో కేబినెట్ ర్యాంకు హోదాను ద‌క్కించుకున్న శ్రీకాకుళం ఎంపీ.. టీడీపీ యువ నాయ‌కుడు 36 ఏళ్ల కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడుకు.. పౌర విమానయాన శాఖ‌ను కేటాయించారు. అయితే.. ఇది గ‌తంలో 2014-19 మ‌ధ్య టీడీపీకే కేటాయించిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనూ టీడీపీ మోడీ స‌ర్కారులో భాగస్వామిగా ఉంది.

అప్ప‌ట్లో పౌర‌విమానయాన శాఖ‌ను టీడీపీకి కేటాయించ‌గా.. మంత్రిగా .. అప్ప‌టి విజ‌య‌న‌గ‌రం ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు అదే శాఖను రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. ఫ‌లితంగా రాష్ట్రంలోని కీల‌క‌మైన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ‌తోపాటు.. క‌డ‌ప‌లో నిర్మించ త‌ల‌పెట్టిన అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య ప‌నులు కూడా వేగంగా ముందుకు సాగ‌నున్నాయ‌ని భావిస్తున్నారు.

ఇక‌, మోడీ కేబినెట్‌లో పాత వారికి పాత శాఖ‌లే అప్ప‌గించారు. ఇక‌, గుంటూరు ఎంపీ ఎన్నారై.. పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌కు స‌హాయ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలానే కీల‌క‌మైన ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, హోం, విదేశాంగ శాఖ‌ను ప్ర‌ధాని మోడీ.. పాత‌వారికే అప్ప‌గించారు. మ‌రోసారి ఆర్థిక శాఖ మంత్రిగా(రాజ్య‌స‌భ స‌భ్యురాలు) నిర్మ‌లా సీతారామ‌న్‌కే కేటాయించారు. ఇక‌, హోం శాఖ‌ను అమిత్‌షాకే ఇచ్చారు.

ఇవీ.. శాఖ‌లు

అమిత్ షా- హోం శాఖ

రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ

జయశంకర్ – విదేశాంగ శాఖ

నిర్మల సీతారామన్ – ఆర్థిక శాఖ

నితిన్ గడ్కరి – రోడ్లు రవాణా శాఖ

మనోహర్ లాల్ ఖట్టర్ – పట్టణ అభివృద్ధి శాఖ

అశ్విని వైష్ణవ్…. రైల్వే సమాచార ప్రసార శాఖ

ధర్మేంద్ర ప్రధాన్…. విద్యాశాఖ

రామ్మోహన్ నాయుడు… పౌర విమానయాన శాఖ

శివరాజ్ సింగ్ చౌహన్… వ్యవసాయ శాఖ

జేపీ నడ్డా….. వైద్యశాఖ

కిరణ్ రిజిజు….. పార్లమెంట్ వ్యవహారాల శాఖ

పీయూష్ గోయల్… వాణిజ్య శాఖ

మనసుఖ్ మాండవీయ… క్రీడలు కార్మిక శాఖ

భూపేంద్ర యాదవ్…. పర్యావరణ శాఖ.