ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు..ఎప్ప‌టి నుంచంటే!

ఏపీలో కూట‌మి పార్టీల విజ‌యం వెనుక‌.. టీడీపీ, జ‌న‌సేన ఇచ్చిన సూప‌ర్ సిక్స్ మేనిపెస్టో కూడా బ‌లంగా ప‌నిచేసింద‌నే ప్ర‌చారం ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే సూప‌ర్ స‌క్స్ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. వీటిలో కీల‌క‌మైంది.. ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం. తాము అధికారంలోకి రాగానే.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. జిల్లాల‌తో కూడా సంబంధం లేకుండా.. ప్ర‌యాణం చేయొచ్చ‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఈ విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం ఎప్పుడంటూ. ప‌లువురు టీడీపీ నాయ‌కుల‌ను మ‌హిళా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రోవైపు ప్ర‌భుత్వ అధికారులు కూడా.. ఈ విష‌యంపై దృష్టి పెట్టారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత పూర్తిస్థాయిలో దీనిపై క్లారిటీ వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైతే.. ఆర్టీసీ ఎండీ నుంచి వివ‌రాలు తెప్పించుకున్నారు. ఉచిత ప్ర‌యాణం అమ‌లు చేస్తే.. ఆర్టీసీ వ‌చ్చే న‌ష్టం ఎంత‌? ప్ర‌భుత్వం భ‌రించాల్సింది ఎంత‌? ఇప్పుడున్న బ‌స్సులు స‌రిపోతా యా? లేదా? అనేవిష‌యాల‌పై ఆరా తీస్తున్నారు. ప్ర‌ధానంగా ప‌ల్లెవెలుగు బ‌స్సుల వ‌ర‌కు ఉచితాన్ని ప‌రిమితం చేయాల‌నే ఆలోచ‌న కూడా అధికార వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కులు కూడా చూచాయ‌గా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

ప‌ల్లెవెలుగు వ‌ర‌కు ఉచితాన్ని ప‌రిమితం చేస్తే.. ఆర్టీసీకి ఇబ్బందులు ఉండ‌వ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. క‌ష్ట న‌ష్టాల‌పైనా దృష్టి పెడుతున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో కూడా ఆర్టీసీ ఉచిత ప్ర‌యాణం అమ‌ల‌వుతోంది. దీంతో అక్క‌డ ఎదుర‌వుతున్న ఇబ్బందులు.. ఎన్నెన్ని బ‌స్సులు న‌డుపుతున్నారు? రోజుకు ఎంత మంది మ‌హిళ‌లు ప్ర‌యాణి స్తున్నారు? అనే విష‌యాల‌పైనా అధికారులు అధ్య‌య‌నం చేస్తున్నారు. వీటి వివ‌రాలు తెలిసిన త‌ర్వాత‌.. పూర్తిస్థాయిలో ఏపీలో అనుస‌రించే విధానాన్ని ఖ‌రారు చేయ‌నున్నారు.

ఇదేస‌మ‌యంలో ఆర్టీసీని ఉచితం చేస్తే.. ఎదుర‌య్యే సామాజిక ఇబ్బందుల‌పైనా దృష్టి పెట్టారు. ప్ర‌ధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది ఆటోడ్రైవ‌ర్లు ఉన్నార‌ని స‌మాచారం. వీరి కుటుంబాలు ఆటో ర‌వాణాపైనే ఆధార‌ప‌డి ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్సీ, ఇత‌ర వాహ‌నాల ర‌వాణా కూడా సాగుతోంది. రేపు ఆర్టీసీని ఉచితంగా తీసుకువ‌స్తే.. వీటిపైనా ప్ర‌భావం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌పై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ప్ర‌త్యామ్నాయంగా ఆటో, ట్యాక్సీ కార్మికుల‌కు ఏం చేయాలి? వారి నుంచి నిర‌స‌న‌లు రాకుండా ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే విష‌యంపైనా దృష్టి పెట్టారు. ఇవ‌న్నీ అయ్యి.. ఆర్టీసీ ఉచిత హామీ అమ‌ల్లోకి వ‌చ్చేందుకు నెల నుంచి రెండు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని.. దాదాపు ద‌స‌రా నాటికి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయొచ్చ‌ని అంటున్నారు.