గుడివాడలో గెడ్డం గ్యాంగ్‌కు చెక్‌!

ఏపీలో వైసీపీ స‌ర్కారు ఓట‌మి త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గుడివాడ మాజీఎమ్మెల్యే కొడాలి నాని అధికారంలో ఉన్న‌ప్పుడు.. తమ భూములు దోచుకున్నారంటూ.. ప‌దుల సంఖ్య‌లో బాధితులు.. ఇప్పుడు అక్క‌డ‌కు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు గెడ్డం గ్యాంగ్ డౌన్ డౌన్ నినాదాల‌తో హోరెత్తించారు.

టీడీపీ విజయంతో గెడ్డం గ్యాంగ్ అరాచకాలను ఎదిరిస్తున్నామ‌ని స్థానికులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. రెండు జెసిబిలతో కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను బాధితులు తొలగించారు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశార‌ని వాపోయారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి. వేధించడమే కాకుండా తమపై దాడి చేయించార‌ని వ్యాఖ్య‌నించారు.

న్యాయం కోసం పోలీసులను వేడుకున్నా.. ప‌ట్టించుకోలేద‌ని బాధితులు తెలిపారు. కోర్టులను ఆశ్రయించా మ‌ని.. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగామ‌ని చెప్పారు. అయినా త‌మ‌కు న్యాయం దక్కలేదని, వెనిగం డ్ల రాము వల్లే నేడు త‌మ‌కుకు న్యాయం జరిగిందని బాధితులు తెలిపారు. అందరినీ 420 అనే కొడాలి నాని అసలైన 420 అని బాధితులు ఆరోపించారు. కొడాలి నానీని గుడివాడ నుండి తరిమి కొడతామ‌ని హెచ్చ‌రించారు. మరలా కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తామ‌ని బాధితులు తెలిపారు.

ఆశలు వదిలేసుకున్న తరుణంలో త‌మ‌ పాలిట దైవంలా వెనుగండ్ల రాము అండగా నిలబడ్డారని బాధితులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇటువంటి నాయ‌కులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నామ‌ని బాధితులు పేర్కొన్నారు. రాము ఎమ్మెల్యే గా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుంద‌ని వారు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.