జ‌నం వ‌చ్చారు.. ఓట్లే రాలేదు: వైసీపీ అంత‌ర్మ‌థ‌నం!

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి ఊహించ‌ని విధంగా హైఓల్టేజ్ షాక్ త‌గిలింది. తాజా ఎన్నిక‌ల్లో గెలిచినా.. ఓడినా.. భారీ మార్పులు అయితే.. ఉండ‌బోవ‌ని ఆ పార్టీ నాయ‌కులు లెక్క‌లు వేసుకున్నారు. గెలిస్తే.. 100-120 సీట్లు , ఓడితే… 55-70 మ‌ధ్య సీట్లు ఖాయ‌మ‌ని చాలా మంది లెక్క‌లు రెడీ చేసుకున్నారు. కానీ, ప్ర‌జ‌లు ఇలా తీర్పు చెప్ప‌లేదు. ఓడించారు. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా.. 11 సీట్ల‌తోనే స‌రిపుచ్చారు. గ‌తంలో 151 సీట్లు ఇచ్చిన ప్ర‌జ‌లు మ‌ధ్య‌లో 5 తీసేసి 11కు ప‌రిమితం చేశారు.

ఈ ప‌రిణామంతో వైసీపీ అగ్ర‌నేత‌ల నుంచి క్షేత్ర‌స్థాయి నాయ‌కుల దాకా కూడా.. అంద‌రూ భారీ షాక్‌లో మునిగిపోయారు. ఈ క్ర‌మంలోనే అస‌లు ఎందుకిలా వైసీపీ ఖ‌ర్మ కాలిపోయింద‌నే చ‌ర్చ‌లు, విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా సిద్ధం స‌భ‌ల వ్య‌వ‌హారంపై వైసీపీ నాయ‌కులు చ‌ర్చ చేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మూడు మాసాల‌ ముందు.. సీఎం జ‌గ‌న్ రాష్ట్రంలోని నాలుగు కీల‌క ప్రాంతాల్లో నాలుగు ‘సిద్ధం’ స‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఉత్త‌రాంధ్ర నుంచి సీమ వ‌ర‌కు కూడా.. ఈ స‌భ‌లు నిర్వ‌హించారు.

విశాఖ‌తో ప్రాంభ‌మైన ఈ స‌భ‌లు క‌ర్నూలు వ‌ర‌కు సాగాయి. ఈ స‌భ‌ల్లో సీఎం జ‌గ‌న్ ఒక్క‌రే మాట్లాడేవారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఆయా స‌భ‌ల‌కు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్ప‌ట్లో కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి మరీ ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క స‌భ‌కు మిలియ‌న్ మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యేలా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. చివ‌రి స‌భ‌కు 15 ల‌క్ష‌ల మందిని తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుని అది కూడా సాధించారు. ప్ర‌జ‌ల‌ను బ‌స్సులు, ప్రైవేటు వాహ‌నాల్లోనూ త‌ర‌లించారు.

మొత్తంగా జ‌నాలు కిక్కిరిసిపోయి.. సిద్ధం స‌భ‌లు స‌క్సెస్ అయ్యాయి. అయితే.. అవ‌న్నీ ఓట్ల‌రూపంలో ప‌డ్డాయా? అంటే ప‌డ‌లేదు. ప‌డి ఉంటే.. 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాల‌కే వైసీపీ ఎందుకు ప‌రిమితం అవుతుంది. పైగా కంచుకోట‌ల వంటి సీమ‌లోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తుడిచి పెట్టుకుపోయింది. అంటే.. మొత్తంగా.. వైసీపీ నిర్వ‌హించిన ద్ధం స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నం.. వైసీపీకి ఓటెత్త‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. స‌భ‌ల్లో క‌నిపించిన సునామీ.. ఈవీఎంల వ‌ద్ద‌కు వ‌చ్చేసరికి .. రివ‌ర్స్ అయిపోయింద‌ని ప‌రిశీల‌కులు కూడా అంటున్నారు.