కాంగ్రెస్ కు మంచిరోజులు.. పదేళ్ల కష్టానికి ఫలితం మొదలు

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మన దేశ ఓటరుకు మించిన తెలివైనోళ్లు ఇంకెవరు ఉండరేమో? విజయం తలకు ఎక్కినన వాళ్లు ఎంతటి మొనగాళ్లు అయినప్పటికీ వారికి దిమ్మ తిరిగేలా షాకిచ్చే విషయంలో మన ఓటర్లకు మించినోళ్లు మరొకరు ఉండరు. ప్రజల్ని గొర్రెల మందలా భావిస్తూ.. తాము చెప్పిందంతా వింటున్నారని తలపోసిన వారికి తలంటే తీరు మరోసారి కనిపించింది. అయోధ్యలో రామాలయం.. ఆర్టికల్ 370తో పాటు మరికొన్ని నిర్ణయాలతో తమకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే మోడీ మాష్టారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేశారు దేశ ప్రజలు. అలా అని మోడీని కాదనలేదు కానీ.. పద్దతి మార్చుకుంటే సరి. లేదంటే ఈసారి కరెంట్ షాక్ తప్పదన్న సంకేతాల్ని బలంగా పంపారు.

ఇదిలా ఉంటే.. 2014లో తగిలిన భారీ దెబ్బ తర్వాత కాంగ్రెస్ కోలుకున్నది లేదు. క్యాలెండర్ లో ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని పరిస్థితి. మొత్తంగా 2014 ఫలితాలు కాంగ్రెస్ కు పీడకలగా మారగా.. పదేళ్ల తర్వాత తాజాగా కాస్తంత ఊరట ఇచ్చేలా ఫలితాలు వెలువడటం ఆసక్తికరంగా మారింది. అలా అని.. చేతికి అధికారం రాలేదు కానీ.. మరికాస్త కష్టపడితే గుర్రం ఎగరావచ్చన్న భావన కలిగేలా చేసిందని చెప్పాలి.
మొత్తంగా చూస్తే.. 2004 నుంచి 2014 వరకు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్.. ఆ తర్వాత నుంచి దాని డౌన్ ఫాల్ షురూ అయ్యింది. 2014లో ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే రాగా.. 2019లో 52 స్థానాల్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 206 సీట్లను సొంతం చేసుకొని కేంద్రంలో యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. 2014లో మోడీ శకం మొదలుకావటం.. 2019లో అది పీక్స్ కు చేరింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లలో గెలిచిన వైనం విపక్షాలకు సైతం నోట మాట రాకుండా చేసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపి ఏకంగా 353సీట్లను సొంతం చేసుకుంది. ఈ ఘన విజయంలో హిందీ బెల్ట్ కీలకంగా మారింది.

నాటి ఫలితాల వేళ ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 74 స్థానాల్లో వియం సాధిస్తే.. బిహార్ లో 39, మధ్యప్రదేశ్ లో 28 సీట్లతో పాటు గుజరాత్.. రాజస్థాన్.. హర్యాన.. ఉత్తరాఖండ్.. హిమాచల్ ప్రదేశ్.. ఢిల్లీలతో కెలిపి మరో 77స్థానాల్లో విజయం సాధించి జాతీయస్థాయిలో తనకు తిరుగులేదని తేల్చింది. కట్ చేస్తే.. తాజాగా వెలువడుతున్న ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. తమకు తాము 370 స్థానాల్లో విజయం సాధిస్తామని.. మిత్రులతో కలిసి 400ప్లస్ సీట్లు ఖాయమని చెప్పుకోవటం తెలిసిందే.

తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తే మోడీ అండ్ కోకు భారీ షాకిచ్చారు ఓటర్లు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ కమలనాథులకు వచ్చినప్పటికీ అది బొటాబొటీ మెజార్టీగా చెప్పాలి. మొత్తం 543 స్థానాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 272 స్థానాలు అవసరం. ఇప్పటికే బీజేపీ అండ్ కో ఆ మార్కును దాటేసింది. కాకుంటే.. బీజేపీకి సొంతంగా 242 స్థానాల్లో మాత్రమే అధిక్యతలో ఉంది. అంటే.. మెజార్టీ మార్కును సొంతంగా సాధించలేని పరిస్థితి. దీంతో.. ఇప్పుడు మిత్రుల దయ మీదనే మోడీ సర్కారు పాలన సాగించాల్సి ఉంటుంది. ఇక.. ఇండియా కూటమి విషయానికి వస్తే.. 192 స్థానాల్లో అధిక్యతలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 94 స్థానాల్లో అధిక్యతలో ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ సొంతంగా ఇన్నిస్థానాల్ని తెచ్చుకుంది లేదు. ఈ రకంగా చూస్తే.. కాంగ్రెస్ పుంజుకుంటుందన్న బలమైన సంకేతాల్ని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.