టిడిపి లాయర్లే జడ్జీలయ్యారా ? వైసిపి ఎంపి సంచలనం

తెలుగుదేశంపార్టీకి లాయర్లుగా పనిచేసిన వాళ్ళే తర్వాత జడ్జీలయ్యారంటూ వైసిపి ఎంపి మిథున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మిథున్ పై ఆరోపణలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టిడిపికి సన్నిహితంగా ఉన్న లాయర్లే తర్వాత జడ్జీలైనపుడు న్యాయవ్యవస్ధ నుండి నిష్పాక్షిక తీర్పులను ఎలా ఆశించగలమంటూ మిథున్ వేసిన ప్రశ్న సంచలనంగా మారింది. చట్టసభల అధికారాలను ఏపిలో హై కోర్టులు తీసేసుకుంటున్నాయంటూ ఎంపి మండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను చూసిన తర్వాత కేంద్రంమే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటూ కోరారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి విచారణకు ప్రభుత్వం నిర్ణయించగానే కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ఎంపి గుర్తుచేశారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్ధను పునఃపరిశీలించాలంటూ ఎంపి చేసిన విజ్ఞప్తిపై టిడిపి ఎంపిలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనే కాకుండా ఫైబర్ గ్రిడ్ లో జరిగిన రూ. 2 వేల కోట్ల అవినీతిపైన కూడా సిబిఐతో విచారణ చేయించాలన్న తమ ప్రభుత్వం నిర్ణయానికి కేంద్రం కూడా మద్దతుగా నిలవాలన్నారు.

తమ డిమాండ్ కు మద్దతుగా రాష్ట్రంలో బిజెపి నేతలు కూడా మద్దతుగా నిలిచిన విషయాన్ని మిథున్ గుర్తుచేశారు. ఎంపి మాట్లాడుతున్నంత సేపు టిడిపి ఎంపిలు సభలో గోల చేస్తునే ఉండటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే మిథున్ చేసిన ఆరోపణలు న్యాయవ్యవస్ధపేనే కాబట్టి టిడిపి ఎంపిలు ఇంతగా గోల చేయాల్సిన అవసరం లేదు. అయినా ఎంపి మాటలకు అంతరాయం కలిగిస్తునే ఉన్నారంటే, ఉలిక్కిపడ్డారంటే ఎక్కడో తేడా ఉన్నట్లే అనుమానించాల్సుంటుంది.

మొత్తానికి న్యాయవ్యవస్ధపై వైసిపి నుండి వరుసగా రెండోరోజు కూడా ఆరోపణలు మొదలయ్యాయి. రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా హైకోర్టులో కొందరు జడ్జీల పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు పనితీరు వల్ల రాష్ట్రప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఎంపి మండిపోయారు. హైకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై విజయసాయి దాదాపు పదినిముషాలు ధ్వజమెత్తారు. సరే చివరకు ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుండి తొలగించారు లేండి. రెండోరోజు మిథున్ కూడా విజయసాయినే అనుసరించారు. మొత్తానికి హైకోర్టుకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో వైసీపీ తిరుగుబాటు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.