త‌గ్గేదేలా… స‌ర్కారుకు దీటుగా కేసీఆర్ తెలంగాణ ఉత్స‌వాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం జూన్ 2న జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం స‌క‌ల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర పండుగ వాతావ‌ర‌ణంలో ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఇక‌, రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తెలంగాణ గీతం, అధికారిక ముద్ర‌, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌లు కూడా చేప‌ట్ట‌నున్నారు. దీనికి దేశ‌వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేత‌లు.. నాడు రాష్ట్ర విభ‌జ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. స‌ర్కారుకు దీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా రెడీ అయ్యారు. తాజాగా ఆయ‌న కూడా ఈ ఉత్స‌వాల‌కు సంబంధించి సంచ‌ల‌న నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. బీఆర్ఎ స్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు’ నిర్వహించాలని నిర్ణ‌యించారు. అంతేకాదు.. స‌ర్కారు క‌న్నా ముందే.. ఈ నెల 1 నుంచి ఉత్స‌వాల‌ను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. వాస్త‌వానికి స‌ర్కారు జూన్ 2న ఈ కార్య‌క్ర‌మం చేయ‌నుంది.

అదేవిధంగా జూన్ 1న గన్ పార్క్ వ‌ద్ద ఉన్న అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ‘అమరజ్యోతి’ వరకు రాత్రి వేళ‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. తెలంగాణ‌ సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించ‌నున్నారు. జూన్ 2వ తేదీన అమ‌రుల స్మృతిని పుర‌స్క‌రించుకుని అమ‌రుల కుటుంబాల‌ను స‌త్క‌రించ‌నున్నారు. ఆర్థిక సాయం కూడా చేయ‌నున్నారు. ఇక‌, జూన్ 3న రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌దేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా భారీ సభను హైదరాబాద్‌లోని బీఆర్ ఎస్ సెంట్ర‌ల్ ఆఫీస్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

దీనికి కేసీఆర్‌తో పాటు.. అనేక మంది నాయ‌కులు.. ప్రొఫెస‌ర్లు.. నాడు ఉద్య‌మ స‌మ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హరించిన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో జెండా ఎగుర‌వేసి.. తెలంగాణ త‌ల్లికి పూల మాల‌లు వేసి.. రాష్ట్ర సాధ‌న‌ను గుర్తుచేసుకోనున్నారు. మొత్తంగా చూస్తే.. స‌ర్కారుకు దీటుగా బీఆర్ఎస్ చేస్తున్న ఈ కార్య‌క్ర‌మాలు ఆసక్తిగా మారాయి.