‘తీన్మార్‌’.. విజ‌యం ఖాయ‌మేనా?

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌కు ముహూర్తం స‌మీపించింది. సోమ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ.. ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఈ హ‌డావుడి క‌నిపిస్తోంది. ఖ‌మ్మం-వ‌రంగ‌ల్‌-న‌ల్ల‌గొండ‌.. ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మొత్తంగా 4.63 ల‌క్ష‌ల మంది ప‌ట్ట భ‌ద్రులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం-వ‌రంగ‌ల్‌-న‌ల్ల‌గొండ‌.. జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల ప‌రిధిలో విస్త‌రించిన ఈ ఎమ్మెల్సీ స్థానం అంద‌రికీ ఆస‌క్తిగా మారింది. అయితే.. ఎన్న‌డూ లేని విధంగా ఫైర్ బ్రాండ్ తీన్మార్ మ‌ల్ల‌న్న(చింత‌పండు న‌వీన్‌) రంగంలో ఉండ‌డంతో ఈ ఉప పోరు కూడా.. హాట్ హాట్‌గా సాగ‌నుంద‌ని తెలుస్తోంది. దీంతో ఎన్నిక‌ల సంఘం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది.

బీఆర్ ఎస్ నాయ‌కులు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి.. గ‌త ఏడాది జ‌రిగిన‌న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌గామ నుంచి విజ‌యం ద‌క్కించుకోవ‌డంతో ఆయ‌న త‌న ఎమ్మెల్సీ ప‌దవికి రాజీనామా చేశారు.దీంతో ఇప్పుడు ఉప పోరు జ‌రుగుతోంది. అయితే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 52 మంది అభ్య‌ర్థులు బ‌రిలోఉన్నారు. వీరిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మ‌ద్ద‌తు ఉన్న ఇద్ద‌రు అభ్య‌ర్థులు తీన్మార్ మ‌ల్ల‌న్న, బీఆర్ ఎస్ త‌ర‌ఫున రాకేష్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ అభ్య‌ర్థి కూడా ఉన్నా.. బ‌ల‌మైన పోటీ ఇచ్చే విష‌యంల సందేహాలు ఉన్నాయి.

ఇక‌, కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ వ‌చ్చీరావ‌డంతోనే నిరుద్యోగుల‌ను ఆక‌ట్టుకుంది. అదేవిధంగా యువ‌త‌ను కూడా ఆక‌ర్షించింది. దీంతో వారంతా ఇప్పుడు త‌మ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న వైపు నిలుస్తార‌నే వాద‌న ఉంది. ఈ గ్రాడ్యుయే ట్ మండ‌లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కాంగ్రెస్‌కు 33 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా..వారంతా కూడా ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు అర్హులే కావ‌డం మ‌ల్ల‌న్న‌కు క‌లిసి వ‌స్తోంది. అలాగే.. మ‌ల్ల‌న్న‌కు సీపీఐ, సీపీఎంల నుంచి కూడా మ‌ద్ద‌తు ఉంది. దీంతో మ‌ల్ల‌న్న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న‌ది కాంగ్రెస్ వాద‌న‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.