దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని.. అందుకే ఆయ‌న ఈ రాష్ట్రమే కాదు.. దేశం నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నార‌ని.. ఓ వ‌ర్గం టీడీపీ నాయ‌కులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. పెద్దిరెడ్డి దేశం విడిచి పోయేది.. జూన్ 1-3 మ‌ధ్య‌లోనేన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, ఇదేవిష‌యంపై సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వ‌చ్చాయి. పెద్దిరెడ్డి ప‌రార్‌ అనే కామెంట్లు వినిపించాయి.

ఈ వ్యాఖ్య‌లపై తాజాగా మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. త‌మ‌కు రాష్ట్రంలోనేకాదు.. దేశం నుంచి కూడా వెళ్లిపోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఆఫ్రిక‌న్ దేశాల్లో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామ‌ని.. అక్క‌డి వెళ్లి వ‌స్తూ ఉంటామ‌ని.. దీనిని ప‌ట్టుకుని కొంద రు ప‌నిలేని టీడీపీ నాయ‌కులు.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని అన్నారు. “ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని వారు.. ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకోలేని వారుకొంద‌రు నాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీరంద‌రికి జూన్ 4న ప్ర‌జ‌లే స‌మాధానం చెబుతారు” అని పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నారా లోకేష్‌పైనా ఈ సంద‌ర్భంగా కామెంట్లు చేశారు.

మంగ‌ళ‌గిరిలో గెలిచి చూపించ‌మ‌నండి! అని పెద్దిరెడ్డి అన్నారు. తాను, త‌న కుమారుడు, త‌మ కుటుంబం రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచి వ్యాపారాలు చేస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. రాజ‌కీయాల్లో సంపాయించింది ఏమీ లేద‌ని.. వ్యాపారాల్లో తెచ్చుకున్న సొమ్మునే రాజ‌కీయాల్లో చాలా ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారి స్థాయి ఏంటో అంద‌రికీ తెలిసిందేన‌ని చెప్పారు. తాము ఎక్క‌డికీ పారిపోవ‌డం లేద‌న్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచితాను చంద్ర‌బాబు బ‌ద్ధ వ్య‌తిరేకుల‌మ‌ని పెద్ది రెడ్డి చెప్పారు. ఈ విష‌యం చిత్తూరు ప్ర‌జ‌ల‌కు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసున‌న్నారు.

ఇక‌, పోలింగ్ పెర‌గ‌డానికి త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేసిన సంక్షేమ‌మే కార‌ణమ‌ని పెద్దిరెడ్డి చెప్పారు. అనేక మంది ల‌బ్ధి పొందార‌ని.. తిన్న‌ది మ‌రిచిపోర‌ని.. వారే క్యూల‌లో నిల‌బ‌డి ఓటేశార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ‌హిళా ఓటు బ్యాంకు పెర‌గడానికి.. వైసీపీ తీసుకువ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాలే కార‌ణ‌మ‌ని పెద్దిరెడ్డి వివ‌రించారు. దీనిని త‌మ‌కు అనుకూలంగానే భావిస్తున్న‌ట్టు చెప్పారు. ఎవ‌రో వ‌చ్చిత‌మ‌కు స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఎవ‌రు ఎలాంటి వారో.. చిత్తూరు ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.