తెలంగాణాలో కొనసాగుతున్న ‘హైడ్రా’మా

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా హైడ్రామా కొనసాగిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం కమిషనర్ రంగనాధ్ ను తొలగించాలని ఆదేశించడమే కాకుండా పలు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా నుంచి వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు. మేము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. దీంతో హైడ్రాపై రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చర్చ మొదలైంది. హైదరాబాద్ లోని జల వనరుల రక్షణ, ప్రభుత్వ ఆస్తులను అక్రమార్కుల చెర నుంచి సంరక్షిస్తామని చెబుతూ గత ఏడాది జులైలో జీఓ నెంబర్ 99 ద్వారా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ (హైడ్రా )ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆది నుంచి వివాదాలే…

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ఉద్దేశ్యం ఒకటైతే క్షేత్ర స్థాయిలో జరుగుతుంది మరొకటన్న విమర్శలు వెల్లువెత్తాయి. బడా బాబుల భవనాలు వదిలిపెట్టి పేదల గుడిసెలు కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి పెట్టిందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. హై కోర్టు తీర్పు దాన్ని ధ్రువీకరిస్తుందని ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు.

కమిషనర్ రంగనాధ్ దూకుడుతో తలనొప్పులు…

హైడ్రా కమిషనర్ రంగనాధ్ దూకుడుతోనే హైడ్రా విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇళ్లను కూల్చి వేయడంతో ఆయనపై 63 కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలయ్యాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అందుకే కమిషనర్ ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ఆదేశించింది. చట్ట పరమైన నిబంధనలు పాటించక పొతే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

సీఎం రేవంత్ వాదన మరోలా…

హైడ్రా కమిషనర్ ను తొలగించాలన్న కోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ స్పందించిన తీరుపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. న్యాయస్థానం మీద గౌరవం ఉందని చెబుతూనే కమిషనర్ రంగనాధ్ పై 63పిటిషన్లు దాఖలైతే గతంలో సోమేశ్ కుమార్ పై 400 పిటీషన్లు దాఖలయ్యని కౌంటర్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా హైడ్రా కొనసాగుతుందని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

హైడ్రా రద్దు చేస్తామంటున్న కేటీఆర్…

మేము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. హైడ్రా పేరుతో భారీ అవినీతి జరుగుతుందని, హైడ్రా ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో ఇరు పార్టీల మధ్య వేడి రాజుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు బాధితులకు మద్దతు ప్రకటించడం తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీలు హైడ్రా విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రానున్న ఎన్నికలలో హైడ్రా ప్రధానాంశంగా మారడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు తీర్పుతోనైనా సీఎం రేవంత్ వెనక్కి తగ్గితే బాగుంటుందని, లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.