మోదీకి బ‌ర్త్‌డే షాక్..కేంద్ర‌మంత్రి రాజీనామా

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఆయ‌న పుట్టిన రోజే ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతుండ‌గా మ‌రోవైపు కేంద్ర కేబినెట్ మంత్రి త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు! అందులోనూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా!!కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లును నిర‌సిస్తూ, కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను ప్రధాని మోదీ కార్యాలయంలో సమర్పించారు.

కేంద్ర మంత్రి ప‌ద‌వికి హ‌ర్‌సిమ్ర‌త్ రాజీనామా చేయ‌డం సంచల‌నంగా మారిన‌ప్ప‌టికీ, దీనికంటే ముందు కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రైతులు, వ్యవసాయ సంబంధ ఉత్పత్తులకు సంబంధించిన కీలక బిల్లులను కేంద్రం తీసుకువ‌చ్చింది. దీనిపై విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. ఇదే స‌మ‌యంలో ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ సైతం దీనిపై విబేధించింది. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్ మాట్లాడుతూ, నూత‌న బిల్లులో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని త‌ప్పుప‌ట్టారు. ఈ బిల్లుతో వ్యవసాయ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని స్ప‌ష్టం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్తుందని తేల్చిచెప్పేశారు.

లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగానే త‌మ వైఖ‌రిని సుఖ్‌బీర్ సింగ్ వ్య‌క్తం చేస్తూ నూత‌న‌ బిల్లు వ్యవసాయరంగానికి వ్యతిరేకంగా ఉన్నందున తాము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామని ప్ర‌క‌టించారు. ఇకపై తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగలేదని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తమ పార్టీ తరఫున కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా ప్రాతినిద్యం వహిస్తున్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన ప్రకటించారు.

శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్ స‌భ‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేసిన కొద్దిసేపటికే సభ నుంచి బయటకు వచ్చిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి వెళ్లారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా ప్రాతినిద్యం వహిస్తున్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా చేస్తున్న‌ట్లు అధికారుల‌కు తెలియ‌జేశారు. అనంత‌రం ఆమె సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కాగా, ప్ర‌ధాన‌మంత్రి పుట్టిన రోజునే ఈ షాకింగ్ నిర్ణ‌యం వెలువ‌డటం, పైగా కీల‌క మిత్ర‌ప‌క్షం వీడిపోవ‌డంతో ప్ర‌తిపక్షాల‌కు కొత్త చాన్స్ ఇచ్చిన‌ట్లయింద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.