కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా ముందుకుసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు నియోజకవర్గాలలో గెలుపు లక్ష్యంగా బహిరంగ సభకు విచ్చేశాడు. కానీ అక్కడ పట్టుమని ఐదు వేల మంది జనాలు లేరు. సాయంత్రం 6 గంటలకు వచ్చి స్టేజి ఎక్కకుండా రాహుల్ గాంధీ కారవాన్ లోనే ఉండిపోయాడు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్టేడియం బయట ఉన్న జనాలను లోపలికి పంపాలని గేటు వద్ద నిలుచుని పిలవడం కనిపించింది. ఎట్టకేలకు 7.10 గంటలకు స్టేజీ మీదకు వచ్చిన రాహుల్ గాంధీ కేవలం 16 నిమిషాలలో ప్రసంగం ముగించి మమ అనిపించారు. చేవెళ్ల, మల్కాజ్ గిరి, భువనగిరి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన రాహుల్ సభ అట్టర్ ప్లాప్ కావడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఏకంగా రాహుల్ గాంధీ వచ్చిన సభకు జన సమీకరణలో విఫలం కావడంపై రేవంత్ రెడ్డి స్టేజీ మీదనే నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భువనగిరి నియోజకవర్గం నుండి రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల నుండి గడ్డం రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి నుండి సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జనసమీకరణలో విఫలమై రాహుల్ ముందు పరువు తీశారని రేవంత్ అన్నట్లు తెలుస్తున్నది. బహిరంగ సభ ముగిసిని తర్వాత రాహుల్ గాంధీ ఒక సిటీ బస్ ఎక్కి కొంతదూరం ప్రయాణించాడు. బస్సులో కాంగ్రెస్ కరపత్రాలు పంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరాడు. అనంతరం బస్సు దిగి తన కారవాన్ లో ఎక్కి వెళ్లిపోయాడు. సరూర్ నగర్ సభ ప్లాప్ నేపథ్యంలో ఈ మూడు రోజులలో జాగ్రత్తగా అడుగులు వేసి ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.