సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి దాదాపు ఏడాదిన్న‌ర అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న బీజేపీ వైపు కానీ.. లేదా టీడీపీలో కానీ చేరుతార‌ని పెద్ద ఎత్తున రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగింది. అయితే.. అప్ప‌ట్లో మౌనంగా ఉన్న సాయిరెడ్డి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ అధికారులు ఆయ‌న నివాసంలో రెండు మాసాల కింద‌ట విచార‌ణ జ‌రిపిన‌ప్పుడు.. రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాను ఏ పార్టీలోకీ చేర‌బోన‌న్న సాయిరెడ్డి.. కొత్త‌గా పార్టీ పెడ‌తాన‌ని కూడా చెప్పారు. అంతేకాదు.. ఏపీలో పొలిటిక‌ల్ గ్యాప్ ఎక్కువ‌గా ఉంద‌ని అన్ని వ‌ర్గాల‌కు స‌మాన న్యాయం అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే తాను కొత్త‌గా పార్టీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. దీనిపై క‌స‌ర‌త్తు కూడా జ‌రుగుతోంద‌న్నారు. కానీ, నెల‌లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్డేట్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు… ఈయ‌న త‌ర్వాత ప్ర‌క‌ట‌న చేసిన బీఆర్ఎస్ మాజీ నాయ‌కురాలు క‌విత‌.. సొంత‌గా పార్టీని పెట్టుకున్నారు. అజెండా, జెండాల‌ను కూడా ఆమె ప్ర‌క‌టించారు. దీంతో సాయిరెడ్డి ఎక్క‌డో వెనుక‌డుగు వేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ విష‌యంపై తాజాగా సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు, ఇత‌ర నాయ‌కులు కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సాయిరెడ్డి కొత్త‌గాపార్టీ పెట్టే అవ‌కాశం లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. పునాదులు లేకుండా ప్ర‌జ‌ల్లో ఎలాంటి సానుభూతి, ఫాలోయింగ్ వంటి ల‌క్ష‌ణాలులేకుండా పార్టీపెట్టేవారికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ఉండ‌ద‌ని చెబుతున్నారు. దీంతో పాటు సాయిరెడ్డికి జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధాల‌ నేప‌థ్యంలో సాయిరెడ్డి పార్టీ పెట్టినా.. అది వైసీపీకి బీ టీంగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో సాయిరెడ్డి వెనుకంజ వేస్తున్నార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు.. బీజేపీతోనూ అంత‌ర్గ‌త సంబంధాలు ఉన్న సాయిరెడ్డికి ఆ పార్టీ నుంచి కూడా వ‌ద్ద‌నే సూచ‌న‌లు వస్తున్న‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు. బీజేపీ ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలిపారు. పైగా రాజ‌కీయం ఇప్పుడు ఖ‌రీదై పోవ‌డం.. ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు.. పార్టీపెట్టేందుకు కూడా కోట్ల రూపాయ‌లు కావాల్సి ఉండ‌డాన్నివారు చెబుతున్నారు. మ‌రోవైపు సాయిరెడ్డిపై ఆయ‌న సామాజిక వ‌ర్గంలోనూ పెద్ద‌గా సానుభూతి లేద‌న్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ కార‌ణాల‌తోనే సాయిరెడ్డి ప్ర‌క‌ట‌న చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. దీనిపై ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేకపోతున్నార‌న్నది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఇదే నిజ‌మా? లేక సాయిరెడ్డి ఏం చెబుతారు అనేది చూడాలి.