రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019 ఎన్నికలలో యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానాల నుండి పోటీ చేసి అమేథీలో ఓటమి, వయనాడ్ లో విజయం దక్కించుకున్నాడు రాహుల్. ఈ ఎన్నికలలో మరో సారి వయనాడ్ నుండి ఎంపీగా మరోసారి బరిలోకి దిగాడు. అక్కడ పోలింగ్ తొలిదశలోనే ముగిసింది.

వయనాడ్ లో ఈ సారి విజయం మీద ఏమయినా అపనమ్మకం ఉందో ఏమో తెలియదు గానీ రాహుల్ గాంధీ తిరిగి అమేథీ నుండి పోటీకి దిగనున్నాడని ప్రచారం జరిగింది. అమేథీ నుండి రాహుల్, రాయ్ బరేలి నుండి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్ బరేలీ నుండి పోటీ దిగుతాడని కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఇక అమేథీ నుండి కాంగ్రెస్ తరపున కిశోరీ లాల్ శర్మను పోటీలోకి దించారు. 

గత ఎన్నికల్లో అమేథీ నుండి రాహుల్ బీజేపీ నేత స్మృతిఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ సారి కూడా ఆమె అక్కడి నుండే పోటీ చేస్తుండగా, అనాదిగా తమకు అండగా ఉన్న అమేథీని రాహుల్ వదిలేయడం గమనార్హం. అమేథీ నుండి 1980లో సంజయ్ గాంధీ, 1981, 1984, 1989, 1991లలో రాజీవ్ గాంధీ, 1999లో సోనియాగాంధీ, 2004 నుండి 2014 వరకు రాహుల్ గాంధీ ఎంపీలుగా గెలిచారు.

రాయ్ బరేలీ నుండి 1952, 1957లలో ఫిరోజ్ గాంధీ, 1967, 1971, 1980లలో ఇందిరాగాంధీ, 2004, 2009, 2014, 2019లలో సోనియాగాంధీలు వరసగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికవగా అమేథిని వదిలిపెట్టి రాహుల్ రాయ్ బరేలీ నుండి పోటీ చేస్తుండడం విశేషం.