ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు. 5 సంవ‌త్స‌రాల కింద‌ట ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. ఆయ‌న ఏకంగా నిలువెత్తు గ‌డ్డం పెంచుకున్నారు. బెంగాల్ వాసుల‌కు-విశ్వ‌క‌వి ర‌వీంద్రుడికి మ‌ధ్య చాలా సెంటిమెంటు ఉంది. ర‌వీంద్రుడి మాదిరిగా మోడీ కూడా గ‌డ్డం పెంచేసుకుని.. నాటి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కూడా చేశారు. దాదాపు ఏడాదిపైగానే ఆయ‌న అలాగే క‌నిపించారు. ఇక‌, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల సంప్ర‌దాయాల మేర‌కు వేషం-భాషా కూడా మార్చేశారు.

ఏప్రిల్‌-మే మ‌ధ్య కాలంలో కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ఈ రెండు రాష్టాల్లోనూ ప్ర‌ధాని మోడీ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. కేర‌ళ‌లోని ఎర్నాకుళం, త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లి జిల్లాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. అయితే.. సాధార‌ణంగా.. రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లో కుర్తా-ఫైజ‌మా ధ‌రించే మోడీ.. తాజా ప‌ర్య‌ట‌న‌లో దుస్తులు మార్చేశారు. కేర‌ళ‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. అక్క‌డి సంప్ర‌దాయానికి అనుగుణంగా.. తొలిసారి లుంగీలో క‌నిపించారు. తెల్ల‌టి లుంగీని క‌ట్టుకుని.. చొక్కా వేసుకున్నారు. త‌మిళ‌నాడులోనూ ఇదే త‌ర‌హా డ్ర‌స్ వేసుకున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ నాయ‌కులు ఎక్కువ‌గా లుంగీలే ధ‌రిస్తారు. ఇది ఆయా రాష్ట్రాల సంప్ర‌దాయానికి సింబ‌ల్‌గా ఉంది. దీనినే ప్ర‌ధాని మోడీ ఫాలో అయ్యారు. ఇక‌, ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆయా స్థానిక భాష‌ల్లోనే ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించ‌డంతోపాటు.. త‌న ప్ర‌సంగంలో ఎక్కువ‌గా కేర‌ళ‌, త‌మిళం ప‌దాల‌ను వినిపించారు.

త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. వికసిత్ కేరళం సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కేరళ పర్యటనలో ఎర్నాకుళంలో 5 వేల 500  కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి.. జాతికి అంకితం చేసారు .ఈ ప్రోజెక్టుల వలన రైతులకు లాభదాయకంగా ఉండటమే కాకుండా యువతకి  ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు.

ఇక‌, త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించి కూడా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మోడీ శ్రీకారం చుట్టారు. తమిళనాడుకి 5 వేల 650 కోట్ల రూపాయల ప్రాజెక్టులను  ప్రకటించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి త‌మిళంలోనే ఎక్కువ‌గా ఆయన ప్రసంగించారు.

క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పెట్రోల్ ఆధారిత తయారీ, రహదారి, రైల్వే ప్రోజెక్టుల వలన తమిళనాడు భవిష్యత్తు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా 14 వందల 90 కోట్ల రూపాయల పెట్టుబడితో , స్థాపించిన.. లూబీ బ్లెండింగ్ ప్లాంట్ ని ప్రారంభించారు. వీటితో పాటుగా రెండు అమృత్ భారత్ , రెండు ఎక్స్ ప్రెస్  రైళ్లకు ప్రధాని పచ్చ జెండా ఊపారు.

ఇక‌, ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌రో రాష్ట్రంలో అస్సాంలో ఈ నెల 13న ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని.. అక్క‌డ నుంచే `పీఎం కిసాన్‌` నిధుల‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఇలా.. మొత్తంగా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పైనే ప్ర‌ధాని ఫోక‌స్ చేయ‌డం గ‌మ‌నార్హం.