‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారిని కిడ్నాప్ చేసి అక్కడకు పంపిస్తే కరెక్ట్ అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు.

గిరిజనుల ఇళ్లకు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ ఇప్పటికే పీపుల్స్ ఫ్రెండ్లీగా మారిందని, అటవీ శాఖ మారాల్సిన అవసరముందని అన్నారు. గ్రీన్ కవర్ పెంపు, బయోడైవర్సిటీ పరిరక్షణతో పాటు ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేలా అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ల సూచనలను అటవీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. నిబంధనలకు అనుగుణంగా పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని ఆదేశించారు. కొంతమంది అటవీ అధికారుల ఇంప్రాక్టికల్ ఆలోచనల వల్ల ఈ తరహా సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో కూడా చర్చిస్తానని తెలిపారు.

శ్రీశైలం ప్రాంతంలో భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో తర్వాత రోజు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పాపికొండల వంటి గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం, బోర్‌వెల్స్, విద్యుత్, రహదారి సౌకర్యాల కల్పనకు అనుమతులు ఇవ్వకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వన్యప్రాణి సంరక్షణ ముఖ్యమని, దాని సాకుతో ప్రజలకు కనీస సౌకర్యాలు నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. పోలీసుల మాదిరి ప్రజలకు అటవీ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.