మేన‌త్త గుట్టు బ‌య‌ట‌పెట్టిన ష‌ర్మిళ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని న‌డిపించే వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌త విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సొంత సోద‌రి ష‌ర్మిళ‌, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జ‌గ‌నే కాపాడుతున్నాడ‌ని, వివేకాను చంపించిన అవినాష్‌కు మ‌ద్దతిస్తారా న్యాయం కోసం పోరాడుతున్న త‌న వైపు నిల‌బ‌డ‌తారా అంటూ ష‌ర్మిళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొంగు చాచి ఓట‌ర్ల‌ను అడ‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో జ‌గ‌న్, ష‌ర్మిళ‌ల మేన‌త్త‌.. వైఎస్ సోద‌రి విమ‌లారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి.. ష‌ర్మిళ‌, సునీత‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శించింది. అవినాష్ రెడ్డి అమాయ‌కుడ‌ని, అత‌డి మీద నింద‌లు వేయొద్ద‌ని.. ష‌ర్మిళ‌, సునీత నాశ‌న‌మైపోతార‌ని ఆమె వ్యాఖ్యానించింది.

విమ‌లా రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిళ కూడా కొంచెం తీవ్రంగానే స్పందించింది. తాము ఆధారాల‌తోనే మాట్లాడుతున్నామ‌ని.. సీబీఐ ఛార్జ్‌షీట్లో పేర్కొన్న విష‌యాల‌నే ఎత్తి చూపుతూ అవినాష్ రెడ్డి మీద ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తుంటే అత‌ణ్ని విమ‌లా రెడ్డి ఎందుకు వెన‌కేసుకు వ‌స్తోంద‌ని ష‌ర్మిళ ప్ర‌శ్నించింది. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా వివేకా హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్.. అధికారంలోకి వ‌చ్చాక సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌ని ఎందుకు చెప్పాడ‌ని ష‌ర్మిళ అడిగింది.

వివేకా హ‌త్య కేసులో త‌న‌ను ఇరికిస్తే అవినాష్ బీజేపీలోకి పోతాడ‌ని ఎందుకు జ‌గ‌న్ అన్నాడో చెప్పాల‌ని ఆమె ప్ర‌శ్నించింది. అంతే కాక విమ‌లా రెడ్డి త‌న‌యుడికి జ‌గ‌న్ కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి ఆర్థికంగా బ‌ల‌ప‌డేలా చేశాడ‌ని.. అందుకే త‌న మేన‌త్త జ‌గ‌న్‌కు అనుకూలంగా, త‌మ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతోంద‌ని.. వయ‌సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, ఎండ‌ల వ‌ల్ల వివేకా త‌న‌కు చేసిందంతా మ‌రిచిపోయి త‌మ మేన‌త్త ఇప్పుడు మరోలా మాట్లాడుతోంద‌ని ష‌ర్మిళ ఎద్దేవా చేసింది.