రాజ‌కీయాల కోసం కోర్టును వాడుకోవ‌ద్దు

మీ రాజ‌కీయాల కోసం కోర్టును వాడుకోవ‌ద్దు. మీ గ‌ల్లీ రాజ‌కీయాల‌ను కోర్టు ముందుకు తీసుకురావ‌ద్దు. ఇదే ఆఖరిసారి. మ‌రోసారి ఇలానే జ‌రిగితే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తాం అంటూ.. వైసీపీపై హైకోర్టు మండిప‌డింది. కోర్టులు అన్న‌వి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తాయ‌ని, రాజ‌కీయాల కోసం కాద‌ని వ్యాఖ్యానించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని ఉప‌సంహ‌రించు కోవాల‌ని.. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొంది. దీంతో స‌ద‌రు పిటిష‌న్‌ను వైసీపీ నాయ‌కుడు వెన‌క్కి తీసుకుంటామ‌ని కోర్టుకు చెప్పారు. ఇక‌పై ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాలు దాఖ‌లుచేసేవారు.. అవి త‌మ వ్య‌క్తిగ‌తం కావ‌ని కూడా అఫిడ‌విట్ దాఖ‌లుచేసేలా ఉత్త‌ర్వులు ఇస్తామ‌ని పేర్కొంది.

ఏం జ‌రిగింది?

2025లో కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన డీఎస్సీ ద్వారా 16 వేల మందికి పైగా నిరుద్యోగుల‌కు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చింది. అయితే.. దీనిలో అన‌ర్హులకు కూడా ప్ర‌భుత్వం ఉద్యోగాలు ఇచ్చింద‌ని ఆరోపిస్తూ.. వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ ప‌ర్వ‌త చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. దీనిలో ఎమ్మెల్సీకి సంబంధించిన విష‌యం ఏముంద‌ని.. ఎమ్మెల్సీ కానీ, ఆయ‌న బంధువులు కానీ.. డీఎస్సీ ద్వారా న‌ష్ట‌పోయారా? అని కోర్టు ప్ర‌శ్నించింది. ఈ సంద‌ర్భంగా ప‌ర్వ‌త త‌ర‌ఫు న్యాయ‌వాది.. వేలాది మంది విద్యార్థులు న‌ష్ట‌పోయార‌ని.. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ జోక్యం చేసుకున్నార‌ని అన్నారు.

డీఎస్సీ నియామ‌కాల‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరారు. అయితే.. బాధిత విద్యార్థులు ఎవ‌రు? వారు కోర్టుకు వ‌చ్చారా? అని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీంతో వారంతా ప్ర‌భుత్వం కేసులు పెడుతుందేమోన‌న్న భ‌యంతో ఉన్నార‌ని.. అందుకే వారి త‌ర‌ఫున ఎమ్మెల్సీ వ్యాజ్యం దాఖ‌లుచేశార‌ని తెలిపారు. ఈ స‌మ‌యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. డీఎస్సీపై ఇప్ప‌టికే ప్ర‌బుత్వం వివ‌ర‌ణ ఇచ్చింద‌ని.. నియామ‌కాలు కూడా జ‌రిగిపోయాయ‌ని తెలిపింది. మ‌రో 350 మంది విద్యార్థులు నేరుగా కోర్టును ఆశ్ర‌యించార‌ని.. వారి పిటిష‌న్లు పెండింగులో ఉన్నాయ‌ని.. ఈ వ్యాజ్యంలో సీబీఐ విచార‌ణ కోర‌డం ద్వారా రాజ‌కీయ కోణం క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించింది.

ప్ర‌జాప్ర‌యోజ‌నం అంటే.. రాజ‌కీయం కాద‌ని, అర్ధ‌వంత‌మైన పిటిష‌న్లు దాఖ‌లు చేయాల‌ని వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిష‌న్ల‌ను విచారిస్తూ.. పోతే.. హైకోర్టు స‌మ‌యం పూర్తిగా వృథాఅవుతుంద‌ని పేర్కొంది. ప్ర‌జాప్ర‌యోజ‌నం క‌న్నా.. పొలిటిక‌ల్ ప్ర‌యోజ‌న‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని.. లేక‌పోతే తామే కొట్టివేయాల్సి ఉంటుంద‌ని పిటిష‌న‌ర్‌కు స్ప‌ష్టం చేసింది. దీంతో ప‌ర్వ‌త త‌న పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకున్నారు.