‘పిఠాపురంలో ప‌వ‌న్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయం’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయ‌న గెలుపు త‌థ్య‌మ‌ని ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. అంద‌రూ చెబుతున్న‌ట్టుగా ల‌క్ష ఓట్ల మెజారిటీ రాక‌పోయినా.. ఖ‌చ్చితంగా 65 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని చెప్పారు. తాను చేయించిన స‌ర్వేల్లో ప‌వ‌న్‌కు అనుకూలంగా మెజారిటీ ప్ర‌జ‌లు తీర్పు చెబుతున్న‌ట్టు తెలిసింద‌న్నారు. ప‌వ‌న్ కోరుకునేవారే ఎక్కువ‌గా ఉన్నారన్నారు. ఇక్క‌డ మెగా కుటుంబానికి భారీ ఫాలోయింగ్ ఉంద‌ని చెప్పారు. ఇది ప‌వ‌న్‌కు ప్ల‌స్ అవుతుంద‌న్నారు.

తాజాగా పిఠాపురంలో ప‌ర్య‌టించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ప‌వ‌న్ కొత్త‌గా అద్దెకు తీసుకున్న ఇంటిని సంద‌ర్శించారు. ప‌వ‌న్‌తోనూ భేటీ అయ్యారు. ఆయ‌న‌కు ప‌ట్టు శాలువా క‌ప్పి.. స‌త్క‌రించారు. ప‌వ‌న్ ఆరోగ్యం బాగోలేద‌న్న వార్త‌లు త‌న‌ను క‌ల‌చి వేశాయ‌ని.. ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకునేందుకు తాను స్వ‌యంగా పిఠాపురం వ‌చ్చాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స్వ‌ల్ప జ్వ‌రంతో ప‌వ‌న్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్టుర‌ఘురామ తెలిపారు. తాను పిఠాపురంలో గ‌త వారం రోజులుగా త‌న మ‌నుషుల‌తో స‌ర్వే చేయించిన‌ట్టు తెలిపారు. ఈ స‌ర్వేలో 65 వేల ఓట్ల‌పైగా మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. తాను చెప్పింది తూ.చ‌. త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని చెప్పారు. రాసిపెట్టుకోవాల‌ని మీడియాకు సూచించారు.

ఇక‌, ప‌వ‌న్‌ను ఓడించేందుకు.. అనేక మంది రెడ్లు ఇక్క‌డ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన ర‌ఘురామ‌.. ఎంత మంది రెడ్లు వ‌చ్చినా.. ప‌వ‌న్‌ను ఓడించ‌డం సాధ్యం కాద‌న్నారు. సాక్ష‌త్తూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చి ఇక్క‌డ కూర్చున్నా.. ప‌వ‌న్ ఓట‌మి అనే మాట వినిపించ‌ద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న పోవాల‌ని కాపులు కోరుకుంటున్నార‌ని.. కాపులే కాదు.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఇదే కోరుకుంటున్నార‌ని.. ఇది పిఠాపురం నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. పిఠాపురంలో పవ‌న్‌కు తిరుగులేద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ఇక‌, త‌న‌కు చంద్ర‌బాబు ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆదేశించినా శిర‌సా వ‌హిస్తాన‌ని ర‌ఘురామ తెలిపారు. అసెంబ్లీ అయినా.. చ‌ట్ట‌స‌బే క‌దా.. అని ప్ర‌శ్నించారు. కుదిరితే పార్ల‌మెంటుకు…లేక‌పోతే అసెంబ్లీకి అయినా త‌న పోటీ ఖాయ‌మ‌ని చెప్పారు. త‌ను ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని ర‌ఘురామ తెలిపారు. వైసీపీ నేత‌లు, రెడ్లు ప‌న్నే ప‌న్నాగాల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని ర‌ఘురామ అన్నారు.