మాజీ మంత్రి గంటాకే భీమిలి.. టీడీపీ మ‌రో జాబితా విడుద‌ల‌

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ మ‌రో జాబితాను విడుద‌ల చేసింది. దీనిలో మాజీ మంత్రి, కాపు నాయ‌కు డు, గంటా శ్రీనివాస‌రావుకు భీమిలి టికెట్ను కేటాయించారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో దీనినే కొరుతున్న విష‌యం తెలిసిందే. దీంతో అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న అనంతరం భీమిలి టికెట్‌ను చంద్ర‌బాబు ఆయ‌న‌కే ఇచ్చారు. తొలుత చీపురుప‌ల్లి(విజ‌య‌న‌గ‌రం, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గం) వెళ్లాల‌ని కోరినా, ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌డంతో ఈ సీటు పెండింగులో ప‌డింది. ఇక‌, ఇప్పుడు భీమిలిని ఆయ‌న‌కే కేటాయించారు.

ఇక‌, ఇత‌ర నేత‌ల విష‌యానికి వ‌స్తే..  చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు  కళా వెంకట్రావును ఖరారు చేశారు. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చీపురుపల్లి ఖరారు చేశారు.  

+ అరకు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించంతో పాడేరుకు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ఖరారు చేశారు.

+ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థి అయ్యారు. శిద్దా రాఘవరావు టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన రాలేదు. దీంతో ఇక్క‌డ డాక్ట‌ర్‌గా పేరున్న ల‌క్ష్మికి చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

+ కీల‌క‌మైన రాజంపేట నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టినా చంద్రబాబు అంగీకరించలేదు.

+ ఇటీవ‌ల‌ టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అందరూ ఊహించినట్లుగానే  గుంతకల్లు నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నుంచి టీడీపీ తరపున వీరభద్రగౌడ్ పోటీ చేస్తున్నారు.

+ అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే కొత్త నేతకు ఇచ్చారు. వాస్త‌వానికిఇక్క‌డ గ‌త ఐదేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేసిన ప్ర‌భాక‌ర చౌద‌రిని ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు.

+ అనంత‌పురం జిల్లా కదిరి నియోజకవర్గానికి కందికంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదా దేవిని అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి కారణం  కందికుంట వెంకట ప్రసాద్ పై కొన్ని కేసుల్లో శిక్ష పడి ఉండటమే. సాంకేతిక సమస్యలు వస్తాయన్న కారణంగా ఆయన భార్యకు చాన్సిచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆ శిక్షలన్నిటినీ కొట్టి వేసింది. దీంతో లైన్ క్లియర్ కావడంతో..  కందికుంట .వెంకట ప్రసాదే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థి పేరును టీడీపీ హైకమాండ్ మార్చింది.

పార్ల‌మెంటుకు వీరు..

విజయనగరం- అప్పలనాయుడు(బీసీ)
ఒంగోలు- మాగుంట శ్రీనివాసుల రెడ్డి  
అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ(బోయ సామాజిక వ‌ర్గం)
కడప – చ‌దిపిరాళ్ల భూపేష్ రెడ్డి(ఈయ‌న ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు)