డ్ర‌గ్స్ ను BJPకి అంటించిన షర్మిల

Sharmila

బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ లో విశాఖ పోర్టుకు చేరిన 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ వెనుక ఉన్నది మీరంటే మీరని టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్ పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ డ్రగ్స్ వెనుక బీజేపీ హస్తం ఉంద‌ని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే నిఘా వ్యవస్థకు తెలియకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయని ప్రశ్నించారు.

డ్రగ్స్ మాఫియాతో బీజేపీకి లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అని షర్మిల నిలదీశారు. విశాఖ డ్రగ్స్ ఘటనలో నిజం నిగ్గు తేల్చాలని సీబీఐని కోరుతున్నామని, సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అంటే ఒకప్పుడు అన్నం పెట్టే అన్నపూర్ణ అని, కానీ ఇప్పుడు భారతదేశానికి డ్రగ్స్ రాజధానిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా ఏపీనే చిరునామాగా మారిందని జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారని షర్మిల విచారం వ్యక్తం చేశారు. “మొదటి ఐదేళ్లు టీడీపీ, ఆ తర్వాత ఐదేళ్లు వైసీపీ… ఈ పదేళ్లలో ఏపీని డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. 25 వేల కిలోల మాదకద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే… మా తప్పేమీ లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీకి సిగ్గుండాలి. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థల సపోర్ట్ లేకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా తీరానికి చేరతాయి? ఇది ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్“ అని షర్మిల నిప్పులు చెరిగారు.