కవితకు షాక్.. వారం రోజుల ఈడీ కస్టడీ!

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కవితను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 18 నుంచి 23 వరకు కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. 7 రోజులపాటు కవితను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. మార్చి 23న మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం హైదరాబాదులో కవితను అరెస్టు చేసిన అధికారులు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఇక, ఈరోజు ఉదయం కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనది అక్రమ అరెస్టు అని, దీనిపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని కవిత అన్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని కవిత ఆరోపించారు.

కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ ఇంకా విచారణలోనే ఉందని, కవిత అరెస్టు చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూపులో కవిత కీలక సూత్రధారి అని ఈడీ తరఫు లాయర్లు వాదించారు. అందుకే ఆమెను మరింత విచారణ జరిపేందుకు కస్టడీకి అప్పగించాలని వాదనలు వినిపించారు.

మరోవైపు, కవితను అరెస్టు చేసే సమయంలో ఈడీ అధికారులతో మాజీ మంత్రి కేటీఆర్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసేటప్పుడు తమ విధులకు కేటీఆర్ ఆటంకం కలిగించారంటూ మహిళా అధికారి భానుప్రియ మీనా ఫిర్యాదు చేశారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు భారీ ఊరటనిచ్చింది. కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరట.