ప్రతిక్షణం జాగ్రత పడుతున్న చంద్రబాబు

ఔను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏమాత్రం ఖాళీ దొరికినా వెంట‌నే అలెర్ట్ అయిపోతున్నారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఫోన్లు చేస్తున్నారు. క‌లివిడిగా ఉండండి.. క‌లిసి ప‌నిచేయండి.. అని చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబు బీజేపీతో మిత్ర‌ప‌క్షం, టీడీపీ-జ‌న‌సేన పొత్తుల‌పై చ‌ర్చిస్తున్నారు. ఇవి ఒక‌ర‌కంగా ఇబ్బందిగా ఉన్నాయి. ఇంత బిజీలోనూ ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంట‌నే క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు పోన్లు చేస్తున్నారు. క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న రెండు ద‌ఫాలుగా 12 నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌కు ఫోన్లు చేశారు.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆయా నేత‌ల‌ను కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

— ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎర్రగొండపాలెంలో పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్‌ బాబు ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు.

— విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ నేతలు విజయ్‌, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌లతో చంద్ర‌బాబు ఫోన్‌లోనే చర్చించారు. విజయ్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఇక్కడ కొంత గ్యాప్ ఉంది. దీనిని స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు.

— ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీకి ప‌ట్టున్న స్థానం నంద్యాలలో మైనారిటీ నేత ఎన్ ఎం డీ ఫరూక్‌కు సహకరించాలని టికెట్ ఆశించి భంగ‌ప‌డిన‌ బ్రహ్మానందరెడ్డికి చంద్ర‌బాబు సూచించారు. బ్ర‌హ్మానంద‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.

— ఉమ్మ‌డి అనంత‌పురంలోని మ‌రో ముఖ్య నియోజ‌క‌వ‌ర్గం కల్యాణదుర్గంలో సీటు దక్కించుకున్నఅమిలినేని సురేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వరనాయుడు, హనుమంతరాయ చౌదరిలను ఆదేశించారు. వీరిద్ద‌రూ కూడా అమిలినేనికి దూరంగా ఉంటున్నారు.

— ఉమ్మ‌డి విజ‌య న‌గ‌రం జిల్లాలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థి టీ జగదీశ్వరి గెలుపునకు కృషి చేయాలన్నారు. ఇక్క‌డ కూడా అసంతృప్తి జ్వాల‌లు పెల్లుబుకుతున్నాయి.

— చిత్తూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో ఈయ‌న పార్టీ మారి వైసీపీలోకి చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను వారించారు.

— ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు, పిఠాపురం నుంచి టికెట్ ఆశించి భంగ ప‌డిన‌ వర్మ, పోలవరం నుంచి టికెట్ ఆశించిన బొరగం శ్రీనివాస్‌, నర్సాపురం నుంచి పోటీలో ఉన్నాన‌ని చెబుతున్న‌ పొత్తూరి రామరాజు, కాకినాడ రూరల్‌లో ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం చేసుకుంటున్న‌ పిల్లి సత్యనారాయణమూర్తి, తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీలకు టికెట్లు ద‌క్క‌లేదు. దీంతో వారు ప‌క్క చూపులు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వీరితోనూ మాట్లాడారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.