కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా?

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి భారీ షాక్ త‌గిలింది. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును ఇటీవ‌ల తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం అయింది.

హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. దీనిపై వారం కింద‌టే నోటీసులిచ్చారు.

తాజాగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. అయితే, దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని.. త‌ను కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా? అంటూ.. మ‌ల్లారెడ్డి ఫైర్ అయ్యారు. మ‌రోవైపు మల్లారెడ్డికి ఇటీవలే అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు.

మరోవైపు, చెరువు కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట, నెక్నామ్ పూర్ లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్ లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీన్ని అడ్డుకునేం దుకు బిల్డర్స్ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో విల్లాల నిర్మాణాలను రెవెన్యూ శాఖ గుర్తించింది.