డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు నిరాధార ఆరోపణలు గగ్గోలు పెడుతున్న వైసీపీ అసలు గుట్టు బయట పడింది. గత ప్రభుత్వం పాలనలో నిర్వహించిన గ్రూప్ -1 లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం వేసిన సిట్ తుది నివేదికను హై కోర్టుకు సమర్పించింది. గ్రూప్ -1 మూల్యాంకనంలో నాటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు సిట్ నిర్ధారించింది. ఏపీపీ ఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా మూడు సార్లు మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదిక ఇచ్చింది.
సిట్ నివేదిక ప్రకారం… ఒకే జవాబు పత్రాలను మూడు సార్లు మూల్యాంకనం చేశారు. మూడో మూల్యాంకనం కోసం కొత్త ఓఎమ్మార్ బార్ కోడ్ షీట్లను 7 ముద్రించారు. ఎంపికైన 165మందిలో 160 మందికి సంబందించిన జవాబు పత్రాల్లో మార్కులలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ, రిట్ పిటీషనర్లకు సంబందించి 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగాయి. 61 మంది స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్లు తేలింది . స్వయంగా చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫారెన్సిక్ నివేదికలో బయట పడింది. జవాబు పత్రాలను హై ల్యాండ్ రిసార్ట్ లో 84 రోజులపాటు దాచి ఉంచడం అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఎక్కడైనా పరీక్షా పత్రాలను నిపుణుల చేత మూల్యాంకనం చేయించడం జరుగుతుంది. వైసీపీ పాలకులు మాత్రం డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత మూల్యాంకనం చేయించారు. 452 మంది నిపుణుల ప్యానల్ ను పక్కన పెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది.
గ్రూప్ -1వంటి ప్రతిష్టాత్మక పరీక్షా పత్రాలను ఒక రిసార్ట్ లో ఎలా ఉంచుతారన్న ప్రశ్నకు సమాధానం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల చేత గ్రూప్ -1 జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేయించడం ఎంత బరితెగింపో అర్ధం చేసుకోవచ్చు. ఈ నివేదిక మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates