ప్యాన్ ఇండియా అని మనం బాహుబలి నుంచి చెప్పుకుంటున్నాం కానీ దీనికి శ్రీకారం చుట్టినవాళ్లు దశాబ్దాల వెనుకాల కూడా ఉన్నారు. ఇది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1991లో నాగార్జున హీరోగా శాంతి క్రాంతి అనే సినిమా వచ్చింది. భారీ బడ్జెట్ తో కన్నడ యాక్టర్ కం డైరెక్టర్ రవిచంద్రన్ తీసిన ఈ యాక్షన్ డ్రామాకు అప్పట్లోనే పది కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. చేసిన అప్పులు తీర్చేందుకు పదిహేను సంవత్సరాలు పట్టిందని రవిచంద్రన్ స్వయంగా చెప్పుకున్నారు.
కొంచెం డీటెయిల్స్ లోకి వెళదాం. శాంతి క్రాంతిని ఒకేసారి నాలుగు భాషల్లో వేర్వేరు ఆరిస్టులతో తీశారు. కన్నడలో రవిచంద్రన్, తెలుగులో నాగార్జున, హిందీ తమిళంలో రజనీకాంత్ మెయిన్ హీరోలు కాగా హీరోయిన్ జూహీ చావ్లా, ఖుష్బూ మాత్రమే కామన్ గా ఉంటారు. మిగిలిన ఆర్టిస్టులందరూ వేర్వేరు. అంటే ఒకే సీన్ నాలుగుసార్లు ఒకే షూటింగ్ స్పాట్ లో తీయాలన్న మాట. యూనిట్లు కూడా వేర్వేరుగా పని చేసేవి. ఈ గ్రాండియర్ గురించి అప్పటి మీడియాలో కథలు కథలుగా వచ్చేవి.
విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత శాంతి క్రాంతిని రీ రిలీజ్ చేయమని అభిమానులు రవిచంద్రన్ మీద బాగా ఒత్తిడి తెచ్చి సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో ట్రెండింగ్ చేస్తున్నారు. శాండల్ వుడ్ మీడియాలో విపరీతమైన ఫోకస్ వస్తోంది. అప్పట్లో ఫ్లాప్ చేశాం కానీ ఇప్పుడు చూస్తామని వేలాది ఫోన్ కాల్స్ రోజూ నిర్మాణ సంస్థకు వస్తున్నాయి. దీనికి నిర్మాత కూడా రవిచంద్రనే కావడంతో ఆయనతో కొడుకుల మీద ప్రెజర్ పెరుగుతోంది.
ఎట్టకేలకు రవిచంద్రన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మొదలయ్యాయని సమాచారం. శాంతి క్రాంతిలో మంచి పాటలు ఉన్నప్పటికీ అవే ఎక్కువైపోయి, సెకండాఫ్ లో అర్థం లేని ఫైట్లు, చిన్న పిల్లల సాహసాలు పెట్టడంతో మాస్ జనాలు ఆదరించలేదు. విలన్ గా అనంత నాగ్ పెర్ఫార్మన్స్ ఎంత బాగున్నా బొమ్మ నిలబడలేదు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ శాంతి క్రాంతిని కన్నడలో మాత్రమే మళ్ళీ విడుదల చేస్తే ఓకే. లేదూ తెలుగులో కూడా అనుకుంటే మాత్రం కష్టమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates