బీఆర్ఎస్‌కు షాకుల‌పై షాకులు

పార్లమెంట్ ఎన్నికలకు స‌మ‌యం ముంచు కొస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి పుంజుకునేం దుకు బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ద‌క్కించుకుని పార్టీ ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే.. పార్టీ ఊహించింది ఒక‌టైతే.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టిగా ఉంది. నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ పార్టీకి దూమ‌వుతున్నారు. మ‌రికొంద‌రు పార్టీలోనే ఉన్నామంటూనే.. పోటీకి దూరంగా ఉంటున్నారు. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో ఏం జ‌రుగుతోందో కూడా అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇప్పటికే పలు స్థానాలకు బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రతిపక్షంలో ఉండటంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు సాధించిన స్థానాల నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌లోని నేతలు ఆసక్తి చూపడం లేదు.

నల్లగొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించిన బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసినట్లు సమాచారం. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు జిల్లాల్లో ఎక్కువగా సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా ఆ రెండు జిల్లాలు చెబుతూ ఉంటారు. దీంతో ఆ రెండు సీట్లల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ రెండు స్థానాలకు బీఆర్ఎస్‌లో అభ్యర్థులు కరువయ్యారు. పలువురు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. వారికి అంత బలం లేకపోవడంతో సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు టికెట్ కావాలని పట్టుబడిన కొంతమంది నేతలు ఇప్పుడు పోటీకి నిరాకరించడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తోంది.

ఇప్పటికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ మాలోక్ కవిత కూడా పోటీ చేసేందుకు తొలుత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే చివరికి అధిష్టానం సూచనతో పోటీకి అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నల్లగొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుకులాట మొదలుపెడుతోంది.