మా జోలికొస్తే.. తొక్కి పేగులు తీసి మెడ‌లో వేసుకుంటం బిడ్డా!

“కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో ఆరు మాసాల్లో కూలిపోతుంది” అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్‌, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పేద‌లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చుంటే ఓర్వ‌లేక పోతున్నారా? అంటూ నిప్పులు చెరిగారు. “కేసీఆర్ ప‌దేళ్లు ముఖ్య‌మంత్రి సీటులో కూర్చున్న‌డు. బీజేపీ కేంద్రంలో ప‌దేళ్లు అధికారంలో ఉంది. కానీ, పేద‌ల ప్ర‌భుత్వం కాంగ్రెస్ .. ఆరు మాసాలు కూడా ఉండ‌కూడ‌దా?” అని రేవంత్ నిల‌దీశారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ట‌చ్ చేస్తే.. పాల‌మూరు బిడ్డ‌లు మానవ బాంబుల మాదిరిగా మారుతార‌ని హెచ్చ‌రించారు.

“మా ప్ర‌భుత్వం జోలికొస్తే.. తొక్కి పేగులు తీసి మెడ‌లో వేసుకుంటం బిడ్డా!” అని సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహబూబ్ నగర్ లో నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీకి తాను వినతి పత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ధర్మంగా రావాల్సిన నిధులు రాకపోతే ఉతికి ఆరేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ప్రధాని మోడీతో అయినా కేడీతో అయినా కొట్లాడతా” అని స్పష్టం చేశారు. తాను మోడీపై చూపే మర్యాద మన రాష్ట్రానికి మంచి జరగడం కోసమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి.. ప్రజలకు మంచిది కాదని రేవంత్ రెడ్డి చెప్పారు.

“సన్నాసుల్లారా.. నేను మోడీని లోపలింట్ల కలవలేదు. ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు. అతిధి మన ఇంటికి వస్తే.. గౌరవించాలని వెళ్లాను. నా ప్రజల కోసమే ప్రధాని మోడీని బహిరంగంగా నిధులు అడిగాను. మనం అడిగిన నిధులు ఇవ్వకపోతే బీజేపీని చీల్చి చెండాడుదాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.