ఇదేనా విజ‌న్ భ‌య్యా!: ష‌ర్మిల‌

జ‌గ‌న్‌ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం ఇదేనా విజ‌న్ భ‌య్యా అంటూ ష‌ర్మిల విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా మంగ‌ళ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. తాను విశాఖ నుంచే పాల‌న ప్రారంభిస్తాన‌ని చెప్పారు. అంతేకాదు..తాను సీఎంగా ఇక్క‌డ నుంచే ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని కూడా వెల్ల‌డించారు. త‌న‌కు ఒక విజ‌న్ ఉంద‌ని.. కానీ, దుష్ట‌చ‌తుష్ట‌యం దీనిని అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే.. సాధార‌ణంగా ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నుంచి భారీ కౌంట‌ర్లు వ‌స్తాయ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేశారు. కానీ, టీడీపీ కంటే కూడా ఎక్కువ‌గా ఆయ‌న సోద‌రి.. కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల రెచ్చిపోయారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని, 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ష‌ర్మిల నిప్పులు చెరిగారు.

“పరిపాలన రాజధానిలో పాలన ప్రారంభించడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్ మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మెస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారు అని” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.