రేవంత్ హవా.. కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు: స‌ర్వ‌ే

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌రోసారి విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని తాజాగా ఓ స‌ర్వే చాటి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అదేవిధంగా ప్ర‌జాపాల‌న దిశ‌గా సీఎం రేవంత్ వేస్తున్న అడుగులు గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మెరిపిస్తున్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 17 స్థానాల‌కు గాను కాంగ్రెస్ పార్టీ 9నుంచి 10 స్థానాల్లో ఖ‌చ్చితంగా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

తాజాగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో ‘ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్’ స‌ర్వే చేసింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అత్యధికంగా 9 నుంచి 10 స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ గెలవనుందని అంచ‌నావేసింది. దీనికి ప్ర‌ధానంగా రేవంత్ హ‌వానే కార‌ణ‌మ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా మ‌హిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంద‌ని పేర్కొంది. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాలు, విద్యార్థులు, డీఎస్సీ వంటివి ఫ‌లిస్తున్నాయ‌ని తెలిపింది.

ఇక‌, పాగా వేస్తామ‌ని చెబుతున్న‌ బీజేపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 5 చోట్ల విజయం సాధిస్తుందని స‌ర్వే విశ్లేషించింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీనికి బండి సంజ‌య్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల హ‌వా క‌నిపిస్తున్న‌ట్టు స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కానుందని మ‌రో సంచ‌ల‌న అంచనా వెల్ల‌డించింది.

మైనారిటీ నాయ‌కుడు, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ సారధ్యంలోని ఏఐఎంఐఎం పార్టీ ఒక సీటులో విజయం సాధిస్తుందని స‌ర్వే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అది కూడా హైదరాబాద్ స్థానాన్నిమరోసారి ద‌క్కించుకుంటుంద‌ని తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికలు-2019లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)- 9 సీట్లు, బీజేపీ – 4, కాంగ్రెస్ -3, ఏఐఎంఐఎం -1 సీటు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి ఎన్నిక‌ల్లో ఈ ఫ‌లితాలు రివ‌ర్స్ కానున్నాయ‌ని స‌ర్వే వెల్ల‌డించింది.