మోడీ 2 వేల విరాళం ఎందుకు అడిగారో తెలుసా?.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించాల‌నే పిలుపు వింటూనే ఉన్నాం. ఒక్క బీజేపీ అనేకాదు.. ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. ఇదే కోరుతుంది. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రో అడుగు ముందుకు వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని ఆర్థికంగా కూడా ప్ర‌జ‌లే బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో తాను భూరి విరాళం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించుకున్నారు. చెప్పిన‌ట్టుగానే ఆయ‌న రూ.2000 ల‌ను బీజేపీ జాతీయ నిధికి విరాళంగా అందించారు. అయితే.. పీఎం మోడీ ఇక్క‌డితో ఆగిపోలేదు. చాలా దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రించారు. దేశ ప్ర‌జ‌లంతా కూడా.. పార్టీకి విరాళాలు ఇవ్వాల‌ని కోరారు.

బీజేపీకి విరాళం రూ.2 వేలను విరాళంగా ఇచ్చిన ప్ర‌ధాని మోడీకి ఆ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గం.. పెద్ద‌ర‌సీదు కూడా ఇచ్చింది. దీనిని ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. బీజేపీని బలోపేతం చేయడానికి, వికసిత్ భారత్ నిర్మించేందుకుగానూ తన వంతు సాయంగా రూ. 2 వేలు అందించానని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం తమకు ‘తోచినంత’ విరాళం అందించాలని పిలుపునిచ్చారు. ‘నమో యాప్’ ద్వారా విరాళం అందించాలని మోడీ కోరారు.

జాతి నిర్మాణం కోసం విరాళాలు అందించండి, వికసిత్ భారత్ ను నిర్మిద్దామని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాను విరాళం అందించిన ఫొటోను ప్రధాని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాని మోడీ బీజేపీ పార్టీకి విరాళం ఇవ్వడంతో పాటు, దేశ ప్రజలను సైతం తమ వంతు విరాళం అందించాలని పిలునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్ప‌టికే వేల కోట్లు..

మోడీ రూ.2000 విరాళం ఇచ్చిన వ్య‌వ‌హారంపై అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏమీ పేద పార్టీ కాద‌ని.. కొంద‌రు నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రికొంద‌రు.. ఇటీవ‌ల ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా బీజేపీ ఎంత పోగేసుకుందో ప్ర‌పంచానికి తెలిసింద‌ని.. అంత సొమ్ము ఉంచుకుని ఇప్పుడు మ‌ళ్లీ ఎందుకు అడుగుతున్నార‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. “మోడీ జీ.. మీ జీతం 5 ల‌క్ష‌లు.. కేవ‌లం రూ.2000 మాత్ర‌మే ఇస్తారా” అని గుజ‌రాత్‌కు చెందిన యువ‌కుడు కామెంట్ చేశారు. ఇదిలావుంటే.. మొత్తం ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా 2019-2024 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు బీజేపీ 3754 కోట్ల‌రూపాయ‌లు విరాళంగా అందాయి. ఇది ఎవ‌రు ఇచ్చారో ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో చెప్ప‌క‌పోవ‌డ‌మే ఈ బాండ్ల స్పెషాలిటీ.