తెలంగాణలో కొత్త సర్వే – కాంగ్రెస్ వైపే మొగ్గా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటి సీట్లు ఖాయమని ఒక సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సంస్ధ తెలంగాణా వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి ఓట్లేస్తారనే విషయంలో అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం ఏమి తేలిందంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలుస్తుందని. బీఆర్ఎస్ 3-5 సీట్ల మధ్య గెలుస్తుందని, బీజేపీకి 2 నుండి 4 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది.

హైదరాబాద్ లో ఎలాగూ ఎంఐఎం గెలుచుకుంటుంది. అధికారపార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కు బాగా కలిసొస్తోంది. ఏ రూపంలో అంటే సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలు రూపంలో. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని ర. 10 లక్షలకు పెంచటంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాల్లో మొగ్గు కనబడుతోందని తేలింది. రు. 500 కే గ్యాస్ సిలిండర్లు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని జనాలు నమ్ముతున్నట్లు సర్వేలో తేలింది.

రెండు హామీలను అమల్లోకి తెచ్చారు కాబట్టి, మరో రెండింటి కోసం జరుగుతున్న కసరత్తును జనాలు గమనిస్తున్నారు కాబట్టే హామీల అమలుపై జనాల్లో నమ్మకం పెరుగుతున్నదట. అలాగే నరేంద్రమోడి పరిపాలన అనే ట్యాగ్ లైన్ బీజేపీకి ఉపయోగపడబోతోందని సర్వేలో బయటపడింది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం ఎలాంటి ట్యాగ్ లైన్ కనబడలేదు. ఈ సర్వేని ఫిబ్రవరి 11-17 మధ్య జరిగినట్లు సంస్ధ చెప్పింది.

తొందరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులు6 శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశాలున్నాయట. తాజా సర్వేని బట్టి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 6 శాతం ఓట్లను కోల్పోబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక ముస్లింల ఓటుబ్యాంకు కూడా బీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్ళతున్నట్లు స్పష్టంగా కనబడిందట. ప్రధానమంత్రిగా మోడీయే ఉండాలని 34 శాతం జనాలు అభిప్రాయపడ్డారు. రాహుల్ కు మద్దతుగా 23 శాతం, ప్రియాంకగాంధికి అనుకూలంగా 11 శాతం, మమతాబెనర్జికి మద్దతుగా 10 శాతంమంది మొగ్గుచూపటం విశేషం.