ఫ్యాన్ ఇంట్లో, సైకిల్ బయట పెట్టండి, గ్లాసు సింక్ లో వేయండి – జగన్

సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ తాజాగా అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ఓ రేంజ్‌లో ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌డంతో పాటు.. స‌టైర్ల‌తో కుమ్మేశారు. పంచ్ డైలాగుల‌తో ప్ర‌సంగాన్ని ఇర‌గ‌దీశారు. వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదన్నారు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ అయిదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ అందించిన సంక్షేమం మరో 5 ఏళ్లు కొనసాగాలని మనం భావిస్తున్నామ‌న్నారు. కానీ ఈ పథకాలు రద్దు చేయడమే టార్గెట్ గా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుతో జరిగే యుద్ధమే ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలన్నారు.

జ‌గ‌న్ ప్ర‌సంగం.. ఎలా సాగిందంటే..

“పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది. 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?” అని ప్ర‌జ‌ల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అంతేకాదు, ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? అని అడిగారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని రైత‌న్న‌ల‌నుఅడుగుతున్న‌ట్టు చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? అని అన్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? అని చంద్ర‌బాబును సీఎం జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. “1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు. రంగు రంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే. అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా?. చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు. చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని సీఎం జ‌గ‌న్ అన్నారు.

అంతేకాదు, “కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం. 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి.” అని పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించాల‌ని సూచించారు. చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలని అన్నారు. “ప్ర‌తి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం. ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం. రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం. రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం. మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు. వైసీపీ పేరు చెబితే… రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది. ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం” అని అన్నారు.

“ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి” అని పంచ్ డైలాగుల‌తో సీఎం జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చామ‌న్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశామ‌న్నారు. 33 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదని నిల‌దీశారు. అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని జగ‌న్ ప్ర‌శ్నించారు. చివ‌రిగా.. “సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు?” అంటూ.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌.. స‌భ‌లో భారీ స్పంద‌న వ‌చ్చేలా చేసింది.