`మ‌హాస్వాప్నికుడు`-చంద్ర‌బాబుపై పుస్త‌కం

టీడీపీ అధినేత చంద్రబాబు జీవిత విశేషాల‌తోపాటు, ఆయ‌న పాల‌న‌, దూర‌దృష్టి వంటి కీల‌క అంశాల‌పై సీనియర్ జ‌ర్న‌లిస్టు పూల విక్రమ్‌ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ఈ పుస్తకాన్ని రూ.50 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ప్రచురించారు.

పుస్త‌క నేప‌థ్యం ఇదీ..
ఈ పుస్త‌కంలో చంద్ర‌బాబు జీవిత విశేషాల‌ను, ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టారు. ముఖ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న దూర‌దృష్టి, ప్ర‌జాపాల‌న‌, పేద‌ల‌ను సంప‌న్నులుగా చేయాల‌న్న దృక్ఫ‌థం వంటివాటిని ఈ పుస్త‌కంలో ర‌చ‌యిత పూల విక్ర‌మ్ స‌మ‌గ్రంగా వివ‌రించారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి… కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగారంటూ.. చంద్ర‌బాబు జీవితాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

చంద్ర‌బాబు త‌న‌ దార్శనికతతో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన తీరును కూడా విక్ర‌మ్ స‌మ‌గ్రంగా పేర్కొన్నారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో మొద‌లు పెట్టిన ఈ పుస్త‌కంలో రాజ‌ధాని అంశాన్ని హైలెట్‌గా పేర్కొన్నారు, `న‌వ‌న‌గ‌రాలు` నిర్మాణ‌మైతే.. ఎలా ఉంటుంది? అనే అంశాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. రైతుల‌ను ఒప్పించి.. మెప్పించి.. వారి నుంచి తీసుకున్న భూములు, రాజ‌ధాని నిర్మాణంలో అర్థ‌రాత్రి వ‌ర‌కు చేప‌ట్టిన స‌మావేశాలు, విదేశీ ప్ర‌ముఖుల‌ను ఒప్పించిన తీరును కూడా విక్ర‌మ్ పూర్తిగా పేర్కొన్నారు.

ఇక‌, వైసీపీ అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న ప‌రిణామాల‌తోపాటు.. రాజ‌ధాని విధ్వంసం.. చంద్ర‌బాబు జైలు జీవితం, ఆయ‌న‌పై పెట్టిన కేసులు, టీడీపీ నేత‌ల‌పై జ‌రిగిన దాడుల‌ను కూడా.. వివ‌రించారు. 53 రోజులపాటు అక్రమంగా జైల్లో పెట్టినా మొక్కవోని దీక్షతో చంద్ర‌బాబు సాగించిన పోరాటం, ఈ స‌మ‌యంలో నారా కుటుంబం బ‌య‌ట‌కు వ‌చ్చిన తీరును కూడా వివ‌రించారు. “చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు-వాస్తవాలపై ఒక అధ్యాయమే ఉంది“ అని విక్ర‌మ్ వివ‌రించారు. చంద్ర‌బాబు కుటుంబానికి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉండేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఆస్తులు సంపాదించారన్నది ఎలా దుష్ప్రచారమో వివరించాన‌ని విక్ర‌మ్ చెప్పారు.