న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు త‌న‌ను బెదిరిస్తున్న‌ట్టు ఆమె తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె వేడుకున్నారు. ఈ మేర‌కు సునీత‌.. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో కాంగ్రెస్ పీసీసీ చీఫ్, త‌న సోద‌రి ష‌ర్మిల‌కు కూడా ప్రాణ హాని ఉంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం వెనుక సొంత మ‌నుషులే ఉన్నార‌ని, రాజ‌కీయ కార‌ణాలతోనే ఈ హ‌త్యకు పాల్ప‌డ్డా రని ఈ హ‌త్య కుట్ర‌కు పాల్ప‌డిన వారికి సొంత మ‌నుషులే అండ‌గా ఉన్నార‌ని కూడా సునీత ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌కు న్యాయం చేయాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి, కేసు విచార‌ణ‌ను తెలంగాణ హైకోర్టుకు మార్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు.. స‌హా ఆయనను అరెస్టు చేయాల‌నే డిమాండ్‌తో మ‌రో న్యాయ పోరాటం సమాంత‌రంగా చేస్తున్నారు.

ఇదిలావుంటే.. మ‌రోవైపు, సునీత‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇటీవ‌ల ష‌ర్మిల క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లోనూ సునీత పాల్గొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేయొచ్చ‌ని భావిస్తున్నారు. ఇదిలా సాగుతున్న క్ర‌మంలో అనూహ్యంగా ఆమె బెదిరింపు మెసేజ్‌లు రావ‌డం.. ఆమెను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది.

చంపేస్తాం, లేపేస్తాం.. ఇక రోజులు లెక్క‌పెట్టుకో.. అంటూ.. త‌న‌ను ఫేస్‌బుక్ లో హెచ్చ‌రిస్తున్నార‌ని డాక్ట‌ర్ సునీత సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నార‌ని కూడా తెలిపారు. తనను, వైఎస్ షర్మిలను “లేపేస్తాం” అనే విధంగా బెదిరిస్తున్నార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫిర్యాదు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ బెదిరింపులు తీవ్ర ఆందోళన‌కు దారితీస్తున్నాయి.