ప‌రామ‌ర్శ‌ల‌తో `పోయేది` చాలానే ఉంది… జ‌గ‌న్‌.. !

ప‌రామ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. పార్టీని కాపాడుకోవ‌డ‌మూ త‌ప్పుకాదు. కానీ, ఎవ‌రిని పరామ‌ర్శించాలన్న విష‌యంలోనే పార్టీలు విజ్ఞ‌త‌తో ముందుకు సాగాలి. ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌న్న వాద‌న ఉంది. ఆయ‌న ప‌రామ‌ర్శ‌ల్లో కొన్ని స‌క్సెస్ అవుతుండ‌గా.. మ‌రికొన్ని బూమ‌రాంగ్ అవుతున్నాయి. పార్టీకి కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తీసుకువ‌స్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును ప‌రామ‌ర్శిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ సాగుతోంది.

వైసీపీలోనూ కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ఈ ప‌రామ‌ర్శ‌ల‌పై త‌మ‌దైన చ‌ర్చ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి విష‌యం అంద‌రికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. త‌న కుమారుడు చేసిన ప్ర‌మాదంలో ఓ గొర్రెల కాప‌రి అందునా బీసీల‌కు చెందిన వ్య‌క్తి మృతి చెందారు. దీనిని క‌ప్పిపుచ్చేందుకు సీదిరి చేసిన ప్ర‌య‌త్నం.. విక‌టించి.. చివ‌ర‌కు ఆయ‌నే జైలుకు వెళ్లారు. దీనిని వైసీపీ నాయ‌కులు కూడా స‌మ‌ర్థించ‌లేక పోయారు. అందుకే శ్రీకాకుళం మొత్తం మౌనంగా ఉంది.

ఇక, త‌మ్మినేని సీతారాం కుటుంబాన్ని కూడా జ‌గ‌న్ ప‌రామ‌ర్శిస్తార‌ని చెబుతున్నారు. ఇది కూడా శ్రీకాకుళంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏవ‌గించుకున్న కేసు కావ‌డం గ‌మ‌నార్హం. భూక‌బ్జా కేసుల్లో కుటుంబంపై కేసులు న‌మోదు కావ‌డం.. హైకోర్టు కూడా అక్షింత‌లు వేయ‌డం వంటివి వైసీపీకి ఇబ్బందిగా మారాయ‌ని భావించిన శ్రీకాకుళం నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు. కానీ, ఇప్పుడు వీరిని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ త‌గుదున‌మ్మా అని వెళ్ల‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. గ‌తంలో పొగాకు, మామిడి, ట‌మాటా వంటి రైతుల‌ను ప‌రామర్శించారు. ఆ స‌మ‌యంలో పార్టీకి మైలేజీ వ‌చ్చింది. ప్ర‌బుత్వం కూడా వెంట‌నే స్పందించింది. కానీ.. ఇప్పుడు ఎవ‌రూ సహించ‌ని.. ఎవ‌రూ ఒప్పుకోని కేసుల్లో చిక్కుకున్న నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించ‌డం అంటే.. అది జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు, ఆయ‌న విజ్ఞ‌త‌కు కూడా పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంద‌ని కీలక నాయకులు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు. ఇది మంచి సంకేతాలు ఇవ్వ‌బోద‌ని కూడా అంటున్నారు.