శిరోముండ‌నం కేసు.. క్వాష్ పిటిషన్ కొట్టి వేసిన హైకోర్టు

ఏపీలోని తూర్పు గోదావ‌రిలో 2020 ప్రారంభంలో చోటు చేసుకున్న ద‌ళిత యువ‌కుడి శిరోముండ‌నం కేసుకు సంబంధించి.. తాజాగా ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కొంద‌రు దాఖ‌లు చేసుకున్న క్వాష్ పిటిష‌న్‌(త‌మ‌పై న‌మోదైన కేసుల‌ను కొట్టివేయాల‌ని కోర‌డం)ను హైకోర్టు తోసిపుచ్చింది. అస‌లు కేసు విచార‌ణ కాకుండానే ఎలా కొట్టి వేస్తామని.. అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో తేల్చాల‌ని.. ఆ త‌ర్వాత ప‌రిశీలిస్తామ‌ని.. హైకోర్టు పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ క్వాష్ పిటిష‌న్‌ను కోట్టివేసింది.

ఏం జ‌రిగింది..

2020 మొద‌ట్లో.. తూర్పుగోదావ‌రి జిల్లాలో అక్ర‌మంగా ఇసుక‌ను త‌వ్వుతున్నార‌ని.. పేర్కొంటూ.. ద‌ళిత యువ‌కుడు వ‌ర‌ప్ర‌సాద్‌.. పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీకి చెందిన నాయ‌కుల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. దీంతో ఇరు ప‌క్షాల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం జ‌రిగింది. వ‌ర‌ప్ర‌సాద్ ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడు. దీంతో ఇది మ‌రింత వివాదంగా మారింది. చివ‌ర‌కు పోలీసులు ఇరు ప‌క్షాల‌ను స్టేష‌న్‌కు తర‌లించారు. అయితే.. అక్క‌డ ఏం జ‌రిగిందో ఏమో.. వ‌ర‌ప్ర‌సాద్‌కు శిరోముండ‌నం జ‌రిగింది. ఇది పోలీసు క‌స్ట‌డీలో జ‌ర‌గ‌డంతో తీవ్ర వివాదంగా మారి.. రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇక‌, ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారు అప్ప‌ట్లోనే హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ జ‌ర‌ప‌కుండా స్టే విధించాల‌ని కోరారు. దీంతో హైకోర్టు అస‌లు మొత్తం విచార‌ణ‌పైనే స్టే విధించింది. దీంతో ఈ కేసు అక్క‌డితో నిలిచిపోయింది. అయితే.. బాధితుడు వ‌ర‌ప్ర‌సాద్‌.. మాత్రం వదిలి పెట్టుకుండా.. అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ క‌మిష‌న్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే తాను న‌క్స‌లైట్ల‌లో క‌లిసి పోతానంటూ.. కొత్త వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. ఇలా ఉన్న ఈ కేసు వ్య‌వ‌హారం.. ఇప్పుడు మ‌రోసారి హైకోర్టు కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం విచార‌ణ స్టేలో ఉన్న నేప‌థ్యంలో అస‌లు త‌మపై కేసులు కొట్టి వేయాల‌ని ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారు అభ్య‌ర్థించారు. బాధితుడు వరప్రసాద్ తరపున ఓ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారని చెప్పారు. అస‌లు విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. అంతేకాదు.. కేసు విచార‌ణ‌ను నిగ్గు తేల్చాల‌ని డీజీపీని ఆదేశించింది.